Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆఫ్ఘన్లో పౌరుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి
- ఎక్కడా...ఎవరికీ భద్రతలేని పరిస్థితి
- ఐక్యరాజ్యసమితి నివేదిక
న్యూఢిల్లీ : నిత్యం బాంబుల మోతతో దద్దరిల్లే...ఆఫ్ఘనిస్తాన్లో సగటు పౌరుడి ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. ఓటరు నమోదు కేంద్రం, షాపింగ్ కాంప్లెక్స్, కూరగాయల మార్కెట్, మసీదు, ప్రభుత్వ కార్యాలయం..ఏదీ సురక్షితం కాదు. ఏదైనా పని నిమిత్తం అక్కడికి వెళ్లిన సగటు పౌరుల ప్రాణాలకు భరోసా లేదు. మరికొన్ని సందర్భాల్లో అటు భద్రతా బలగాలు, ఇటు తాలిబాన్ ఉగ్రవాదుల దాడుల నడుమ అమాయక పౌరులు బలి అవుతున్నారు. ఆఫ్ఘన్ పౌరుల మరణాలు ఆందోళన కలిగిస్తోందని ఐక్యరాజ్యసమితి సైతం ఆందోళన వ్యక్తం చేసింది.
గత ఆరునెలల కాలంలో జరిగిన బాంబు దాడుల ఘటనల్లో 1692మంది పౌరులు మరణించారని ఐరాస తాజా నివేదిక వెల్లడించింది. ఆఫ్ఘన్లో విధులు నిర్వర్తిస్తున్న ఐరాస సహాయక బృందం ఈ నివేదికను రూపొందించింది. ఈ ఏడాది పౌర మరణాలు రికార్డుస్థాయికి చేరి, సర్వత్రా ఆందోళన కలిగిస్తోందని, అటు ఇస్లామిక్ స్టేట్, ఇటు తాలిబాన్లు ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట ఆత్మాహుతి దాడులకు తెగబడుతున్నాయని నివేదికలో స్పష్టం చేశారు.
రంజాన్ సందర్భంగా మూడు రోజులపాటు తాలిబాన్లు, ఇటు భద్రతా బలగాలు కాల్పుల విరమణ పాటించటం, కాబూల్, ఇతర నగరాల్లో భద్రతా బలగాలు, తాలిబాన్లు కలిసిపోయి కనపడటం...వంటి అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ తాత్కాలిక కాల్పుల విరమణ, శాశ్వతంగా ఏర్పడితే ఎంత బాగుంటుందో...అన్న ఆశలు ప్రతీ ఒక్కరిలోనూ ఏర్పడ్డాయి. కానీ రంజాన్ కాల్పుల విరమణ ఒప్పందం ముగియగానే పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.
కాబూల్, జలాలాబాద్...మొదలైన నగరాల్లో ఆత్మాహుతి దాడులు పెరిగాయి. నాన్గార్హర్ ప్రావిన్స్లో ఇస్లామిక్ స్టేట్ కదలికలు రెట్టింపయ్యాయి. జలాలాబాద్లో ఉన్నతస్థాయి అధికారుల్ని, రాజకీయ నాయకుల్ని లక్ష్యంగా చేసుకొని దాడులు జరుపుతున్నారు.
భద్రతకు చోటు లేదు..
భద్రతా బలగాలు, తాలిబాన్లకు మధ్య చోటుచేసుకుంటున్న దాడుల్లో పెద్ద సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. మసీదు, మార్కెట్ ఆవరణల్లో, రోడ్డు పక్కన...జరుగుతున్న ఆత్మాహుతి దాడులు పెద్ద సంఖ్యలో పౌరుల ప్రాణాల్ని బలితీసుకుంటున్నాయి.
ఓటరు నమోదు కేంద్రాల్ని, ప్రభుత్వ కార్యాలయాల్ని, సహాయక సంస్థల సేవా ప్రాంతాల్ని ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకోవటం దారుణం. పౌరుల మరణాల్లో అత్యధికం షాపింగ్ కాంప్లెక్స్లలో, ఆత్మాహుతి దాడుల్లో చోటుచేసుకుంటున్నాయి. ఈ దాడుల్ని తామే జరిపామని ఇస్లామిక్ స్టేట్, తాలిబాన్లు ప్రకటించుకుంటున్నాయి.