Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమర్జెన్సీ ప్రకటించిన సర్కారు
తెగుసిగల్పా: దేశంలోని దక్షిణాది రాష్ట్రాలలో నెలకొన్న కరువు పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొని ప్రజలను ఆదుకునేందుకు హోండూరాస్ ప్రభుత్వం ఆ రాష్ట్రాలలో ఎమర్జెన్సీని ప్రకటించింది. కరువు కారణంగా ఎల్ వాలె, చోలుటెకా రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు హోండూరాస్ ప్రభుత్వం గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. కరుడు పీడిత ప్రాంతాలలో ఒక నగర మేయర్ అయిన ఎడ్గార్ మురిల్లో స్థానిక మీడియాతో మాట్లాడుతూ తమ నగరంలోని వ్యవసాయ క్షేత్రాలలో కరువు ఛాయలు అలముకోవటంతో అనేక కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో అనేక కుటుంబాలు తమ వ్యవసాయోత్పత్తులను కొంత విక్రయించుకుని కొంత భాగం సొంత వినియోగం కోసం వుంచుకుంటున్నారని, ఈ ఏడాది కరువు పరిస్థితులతో సాగు పొలాలన్నీ బీడువారిపోయాయని, వ్యవసాయ ఆదాయం కోల్పోవటంతో ప్రజలు ఆకలి కేకలు పెడుతున్నారని ఆయన చెప్పారు. దీనికి తోడు కరువు ప్రాంతాలలో పశుగ్రాసానికి లోటు ఏర్పడటంతో పశువులు మరణిస్తున్నాయన్నారు. కరువు పరిస్థితులపై సమీక్షించిన అధ్యక్షుడు జువాన్ ఆర్లెండో హెర్నాండెజ్ ఈ రెండు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఈ నెల 15 నుండి డిసెంబర్ 31 వరకూ ఈ పరిస్థితి అమలులో వుంటుందని, ఈ కాలంలో దేశంలోని 34 నగరాలలో దాదాపు 65,500 కుటుంబాలకు అత్యవసర ఆహార పదార్ధాలను అందచేస్తామని ప్రభుత్వం వివరించింది.