Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్యాంగ్యాంగ్: అణు నిరాయుధీకరణపై ఉభయ కొరియాల నేతలు చర్చలకు సిద్ధమయ్యారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్-జే-ఇన్, ఆయన భార్య కిమ్ జింగ్ సుక్లు తమ మూడు రోజుల పర్యటన కోసం ఉత్తరకొరియా రాజధాని ప్యాంగాంగ్కు మంగళవారం ఉదయం చేరుకున్నారు. దక్షిణకొరియా నేతకు కిమ్ దంపతులు విమానాశ్రయంలో సాదర స్వాగతం పలికారు. గత దశాబ్ద కాలంలో దక్షిణ కొరియా నేత ఒకరు ఇలా ఉత్తరకొరియాలో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ ఏడాది ఏప్రిల్లో మూన్, కిమ్లు తొలిసారి భేటీ అయిన తరువాత వీరిద్దరూ కలుసుకోవడం ఇది మూడోసారి. మునుపెన్నడూ లేనట్టుగా ఈ ఏడాది ఉత్తర కొరియా అటు అమెరికా, ఇటు దక్షిణ కొరియా నాయకత్వంతో భేటీ అవుతోంది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్లు చర్చలు జరిపింది. ఉత్తర కొరియా, అమెరికాల మధ్య దక్షిణకొరియా మధ్యవర్తిత్వం వహిస్తూ కీలకంగా వ్యవహరిస్తోంది.
అమెరికా, ఉత్తరకొరియా మధ్య చర్చలకు
ఈ భేటీ తోడ్పడుతుందా?
ఉత్తరకొరియా అంతర్జాతీయంగా కఠిన ఆంక్షలు ఎదుర్కొంటున్న సమయంలో దక్షిణ కొరియా ఆ దేశంతో కొత్త ఆర్థిక సంబంధాలు ఏర్పరుచుకోవడం ఆంక్షల సడలింపుపై ఆధారపడి ఉంటుంది. ట్రంప్, కిమ్ ఈఏడాది జూన్లో భేటీ అయ్యారు. కొరియా ద్వీపకల్పాన్ని అణ్వస్త్ర రహితంగా మార్చే ఒప్పం దం వీరిద్దరి మధ్య కుదిరింది. దానికి స్పష్టమైన కాల పరిమితి ఏమీ నిర్దేశించుకోలేదు. ఆ తర్వాత కిమ్ ఎలాంటి చర్యలూ చేపట్టలేదని అంతర్జా తీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు అమెరికా కూడా తొలుత నిరాయుధీకరణ చేస్తే ఆ తరువాత ఆంక్షల ఎత్తివేత ఉంటుందని చెబుతోంది. ఉత్తరకొరియా మాత్రం ఈ ప్రక్రియ దశలవారీగా జరగాలని కోరుకుంటోంది. కాగా... ఇటీవల మరోసారి భేటీ కోసం ఉత్తరకొరియా ట్రంప్నకు ఆహ్వానం పంపించింది. ట్రంప్ తొలి విడత పాలనాకాలంలోనే అణు నిరాయుధీకరణ పూర్తిచేయాలని కిమ్ భావిస్తున్నారని దక్షిణ కొరియా రాయబారులు తెలిపారు.
అజెండాలోని అంశాలు...
- కొరియా ద్వీపకల్పాన్ని అణ్వస్త్ర రహితంగా మార్చేందుకు చేపట్టాల్సిన ఆచరణ సాధ్యమైన చర్యలపై వీరిద్దరూ చర్చించనున్నారు
- ఇప్పుడు జరుగనున్న సమావేశంలో మరింత ముందడుగు వేసి ఆర్థిక సంబంధాలనూ పెంచుకోవడం రెండు దేశాల ప్రధానోద్ధేశంగా తెలుస్తోంది. సరిహద్దుల్లో పెద్దసంఖ్యలో ఉన్న సైనిక మోహరింపును తగ్గించడం కూడా ఈ సమావేశంలో చర్చకు రావొచ్చు.
దక్షిణకొరియాకు ప్రధానంగా రెండు లక్ష్యాలున్నాయి. రెండు దేశాల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడం.. అలాగే, అణు నిరాయుధీకరణ విషయంలో వాషింగ్టన్, ప్యాంగాంగ్ల మధ్య రాయబారం చేయడం.
- ఏప్రిల్లో వీరిద్దరూ భేటీ అయినప్పుడు రెండు దేశాల మధ్య సంబంధబాంధవ్యాలు పెంపొందించుకోవడం, అణు ముప్పు నివారించడంపై సంయుక్త ప్రకటన చేశారు.
- ఆ తరువాత నుంచి కొరియా విభజన సమయంలో విడిపోయిన కుటుంబాలు తిరిగి కలుసుకునే ఏర్పాట్లు చేశారు. అంతేగాకుండా, రెండు దేశాల మధ్య 24/7 కమ్యూనికేషన్లకు వీలుగా సరిహద్దులో ఒక లైజన్ ఆఫీసర్ను కూడా నియమించారు.