Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్-జోంగ్-ఉన్ ఆ దేశానికి చెందిన ఒక ముఖ్యమైన క్షిపణి పరీక్ష కేంద్రాన్ని అంతర్జాతీయ నిపుణుల సమక్షంలో మూసివేతకు అంగీకరించినట్టు దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్-జే-ఇన్ ప్యాంగ్యాంగ్లో తెలిపారు. 'టొంగ్చాంగ్-రి క్షిపణి ప్రయోగ కేంద్రాన్ని శాశ్వతంగా మూసివేయడానికి కిమ్ అంగీకరించారు' అని మూన్ తెలిపారు. టొంగ్చాంగ్-రి 2012 నుంచి ఉత్తర కొరియా ప్రధానమైన క్షిపణి ప్రయోగం కేంద్రం. ఉత్తర కొరియా నుంచి అమెరికా వరకు వెళ్లగల క్షిపణుల ప్రయోగం కూడా ఇక్కడి నుంచే జరిగింది. అంతే గాకుండా, యాంగ్ బ్యాన్ అణు కేంద్రం మూసివేతకు కూడా కిమ్ అంగీకరించినట్టు మూన్ వెల్లడించారు. అణుపరీక్షలకు అవసరమైన పదార్థాలను ఇక్కడే తయారు చేస్తారని తెలుస్తోంది. అయితే, అమెరికా కూడా దీనికి తగిన విధంగా ప్రతిస్పందించాలని కిమ్ కోరినట్టు మూన్ తెలిపారు. అయితే ఎలాగన్నది మాత్రం ఆయన వివరించలేదు. ఉత్తర కొరియా గత జూన్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. కిమ్ను కలవడానికి మునుపే తమ పంగ్యేరీ అణు పరీక్ష కేంద్రాన్ని పేల్చేసింది. కాగా.. కొరియా ద్వీపకల్పంలో మిలిటరీపరమైన శాంతి స్థాపన కోసం ఇది ఒక పెద్ద ముందడుగు అని కిమ్ అభివర్ణించారు. రాబోయే కాలంలో తాను సియోల్లో పర్యటిస్తానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
శిఖరాగ్ర సదస్సు... అణునిరాయుధీకరణ
- ప్రస్తుతం ఉభయ కొరియాల మధ్య ప్యాంగ్యాంగ్లో జరుగుతున్న ఈ సదస్సు ప్రధాన లక్ష్యం అణు నిరాయుధీకరణే.
- ఈ ఏడాది ప్రారంభంలో అమెరికా, ఉత్తర కొరియాల మధ్య ఈ విషయంపై స్థూలంగా ఒక అంగీకారం కుదిరినా, ఆ తర్వాత చర్చలు ఆగిపోయాయి. ఇప్పుడు ఈ సదస్సు ద్వారా దానికి కట్టుబడి ఉన్నట్టు ఉత్తర కొరియా నిరూపించుకోవాలనుకుంటోంది. ఈ సదస్సు ద్వారా ఉభయ కొరియాలు రైల్వే లైన్లను కలుపుకోవడం, యుద్ధంలో విడిపోయిన కుటుంబాలు మరింత ఎక్కువగా కలుసుకునే అవకాశం కల్పించడం, ఆరోగ్య సేవల విషయంలో మరింత సహకరించుకోవాలనుకుంటున్నాయి.
- 2032లో ఉభయ కొరియాలు కలిసి సమ్మర్ ఒలింపిక్స్ను నిర్వహించే అవకాశాలనూ పరిశీలిస్తారు.