Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికా వెల్లడి
వాషింగ్టన్/సియోల్: ఉ.కొరియాతో అణు చర్చల పునఃప్రారంభానికి అమెరికా సంసిద్ధత వ్యక్తం చేసింది. అమెరికా తమ భద్రతకు అవసరమైన చర్యలు తీసుకుంటే తమ దేశంలోని ప్రధాన అణు ప్రయోగ కేంద్రం యాంగ్బియాన్ న్యూక్లియర్ కాంప్లెక్స్తో సహా కీలకమైన క్షిపణి ప్రయోగ కేంద్రాలను నిర్మూలించేందుకు సిద్ధమని ఉ.కొరియా బుధవారం ప్రకటించిన నేపథ్యంలో దానిపై స్పందించిన అమెరికా ఈ ప్రకటన చేసింది. 2021 జనవరి నాటికి ఉ.కొరియా తన అణు నిరాయుధీకరణ పూర్తి చేయాలన్న లక్ష్యంతో వచ్చే వారం ఉ.కొరియా విదేశాంగ మంత్రిని చర్చలకు ఆహ్వానించినట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో చెప్పారు. వచ్చే వారం న్యూయార్క్లో జరుగనున్న ఈ భేటీలో ఈ అంశంపై ఒక అవగాహనకు రాగలమని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. అణు నిరాయుధీకరణ దిశగా ఉ.కొరియా నామమాత్రపు చర్యలు తీసుకుంటోందన్న ఆరోపణల నేపథ్యంలో బుధవారం ద.కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్తో జరిగిన భేటీలో ఉ.కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తన హామీలకు కట్టుబడి వుండేలా వత్తిడి పెంచాలని అమెరికా భావిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఉ.కొరియా తన అణు, క్షిపణి ప్రయోగ కేంద్రాల మూసివేతను పరిశీలించేందుకు కొన్ని దేశాల నుండి నిపుణులను అనుమతించనున్నదని బుధవారం నాడు కిమ్తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ద.కొరియా అధ్యక్షుడు మూన్ వెల్లడించిన విషయం తెలిసిందే. దీనితో పాటు అమెరికా తమ భద్రతకు అవసరమైన చర్యలు తీసుకుంటే ప్రధానమైన యాంగ్బియాన్ అణు స్థావరంతో సహా ఇతర అణు, క్షిపణి ప్రయోగ కేంద్రాలను మూసి వేసేందుకు ఉ.కొరియా చర్యలు తీసుకుంటుందని ఆయన వివరించారు. ట్రంప్, కిమ్ల మధ్య జూన్లో జరిగిన భేటీ తరువాత ఉ.కొరియాపై ట్రంప్ సర్కారు వైఖరి మారిన నేపథ్యంలో ఇరుదేశాల మధ్య దౌత్యంపై అనేక సందేహాలు తలెత్తిన వేళ మళ్లీ ఈ ప్రతిపాదనలు తెరపైకి రావటం విశేషం. కొరియా అణు నిరాయుధీకరణ పూర్తి చేసేందుకు 2021 జనవరి వరకూ గడువు విధించటం వెనుక ప్రధానోద్దేశం ఈ సుదీర్ఘకాల ప్రక్రియను పూర్తి చేసేందుకు ఉ.కొరియా తగినంత సమయం ఇవ్వటమేనని పరిశీలకులు చెబుతున్నారు. వచ్చే వారం ఉ.కొరియా విదేశాంగ మంత్రిని చర్చలకు ఆహ్వానించటంతో పాటు ఉ.కొరియా వ్యవహారాల ప్రత్యేక ప్రతినిధి స్టీఫెన్ బీగన్తో వియన్నాలో భేటీ అయ్యేందుకు ఉ.కొరియా ప్రతినిధి బృందాన్ని కూడా తాము ఆహ్వానించినట్లు పాంపియో వివరించారు. గత జూన్లో ఉ.కొరియా, అమెరికా మధ్య కుదిరిన ఒప్పందాన్ని తాము స్వాగతిస్తున్నామని, దీనిని గట్టిగా సమర్థిస్తున్నామని ఉ.కొరియా మిత్ర దేశం చైనా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇరుదేశాల మధ్య శాంతికి అంది వచ్చిన తాజా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం వుందని చైనా ప్రభుత్వ సలహాదారు వాంగ్యి బుధవారం తనను కలిసిన మీడియా ప్రతినిధులకు చెప్పారు.