Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పింఛన్ పథకం అమలు కావడం లేదు
- దళితులైనందునే వీరిపట్ల వివక్ష
- గుర్తింపు కార్డుల జారీకి మండల కేంద్రాల్లో కౌంటర్లు ఏర్పాటు చేయాలి: డీఎస్ఏంఏం జాతీయ ప్రధాన కార్యదర్శి వి.శ్రీనివాసరావు
అమరావతి :డప్పులతో విజయవాడ నగరం మారుమోగింది. డప్పు కళాకారులు తమ డిమాండ్ల సాధన కోసం మంగళవారం నిర్వహించిన ప్రదర్శనలో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది పాల్గొన్నారు. తొలుత రైల్వేస్టేషన్ నుంచి సభ జరిగే సంగీత కళాశాల వరకు కళాకారుల బృందాలు డప్పు వాయిస్తూ ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనను దళిత సోషన్ ముక్తి మంచ్ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ డప్పు కళాకారులను పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని, పింఛను పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రకటించి మూడు నెలలైనా అమలుకు నోచుకోకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. డప్పు కళాకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏండ్ల తరబడి అమలు కావడం లేదన్నారు. ప్రజల్లో చైతన్యం నింపే వీరి జీవితాల్లో పాలకుల చర్యల వల్ల వెలుగు కరువయ్యిందన్నారు. రియల్ టైమ్ గవర్నెన్స్లో ఏదైనా నేరుగా పర్యవేక్షించే అవకాశముంటుందని చెప్పే సీఎం, మూడు నెలలుగా డప్పు కళాకారులకు పింఛను పథకాన్ని అమలు చేయకపోయినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం డప్పు కళాకారులపై వివక్ష చూపడానికి ప్రధాన కారణం వీరు దళితులు కావడమేనన్నారు.
వీరికి గుర్తింపు కార్డులిచ్చేందుకు భాషా సాంస్కృతిక శాఖ ప్రతి మండలంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి, నమోదు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జీవపుత్ర కుమార్ మాట్లాడుతూ సంఘం నాయకుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. భాషా సాంస్కృతిక శాఖ డిప్యూటీ డైరెక్టర్ వసంతరావు మాట్లాడుతూ గుర్తింపు కార్డులిచ్చేందుకు వెబ్సైట్ సిద్ధం చేశామని, కళాకారులు నమోదు చేసుకుంటే నేరుగా గుర్తింపు కార్డులు వారికే ఇస్తామని చెప్పారు. ఇతర కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు. రైల్వే పాసులు ఇస్తున్నామని, బస్సు పాసులకు ఆర్టీసీ అభ్యంతరం తెలిపిందన్నారు. శిక్షణ కేంద్రాలకు నిధులు కేటాయించా మని, ఇండ్ల స్థలాలు, ఇండ్లు అంశాలను రెవెన్యూ శాఖ దృష్టికి తీసుకెళ్తామన్నారు.
కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ 2010లో డప్పు కళాకారుల సంఘం ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి పోరాటాలు ప్రారంభించడంతో 2014లో డప్పు పండుగ నిర్వహణకు ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని, అయినప్పటికీ పండుగ నిర్వహణలో విఫలమయ్యిం దన్నారు. కళాకారులందరికీ గుర్తింపుకార్డులు, డ్రస్సులు, పింఛన్లు సాధించడానికి సంఘం పోరాడుతోందని, కొంత వరకు విజయం సాధించామని చెప్పారు.