Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 70వేల మంది భారతీయులపై ప్రతికూల ప్రభావం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూఎస్లోని విదేశీ ఉద్యోగులకు వ్యతిరేకంగా మరో నిర్ణయం తీసుకున్నారు. హెచ్1-బీ వీసా విధానంలో సవరణలు చేయబోతున్నట్టు ట్రంప్ సర్కారు ప్రకటించింది. ఇందులో భాగంగానే హెచ్4 వీసా వర్క్ పర్మిట్లను తొలగించేందుకు సిద్ధమవుతోంది. దీంతో హెచ్4 వీసా ద్వారా ఉద్యోగం చేస్తున్న 70వేల మంది భారతీయులపై ప్రతికూలంగా ప్రభావం పడనుంది. హెచ్1-బీ వీసాతో అనేకమంది భారతీయ ఐటీ నిపుణులు అమెరికా కంపెనీలలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ హెచ్1-బీ వీసా హోల్డర్ల భార్యలు(21ఏండ్లలోపు పిల్లలు) అమెరికాలో ఉండేందుకు, ఉద్యోగం చేసేందుకు హెచ్4 వీసా అవకాశం కల్పిస్తుంది. ఒబామా పాలనలో అనేకమంది భారతీయులు హెచ్4 వీసా ద్వారా ఉద్యోగాలు పొందారు. కాగా, హెచ్1-బీ వీసా విధానాలను వచ్చే ఏడాది జనవరిలోగా సవరిస్తామని హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ తాజాగా వెల్లడించింది. హెచ్1-బీ వీసా హోల్డర్ల భార్యలకు హెచ్4 వీసా కింద ఉద్యోగాలు పొందే అర్హతలను తొలగించేందుకూ ప్రతిపాదించబోతున్నామని తెలిపింది. అమెరికాలోని కంపెనీలు హెచ్1-బీ వీసాను దుర్వినియోగపరుస్తూ.. అమెరికన్ల స్థానాల్లో విదేశీయులను నియమించుకుంటున్నాయని ట్రంప్ సర్కారు భావిస్తున్నది. ఈ అంశంపై సమీక్ష కూడా నిర్వహిస్తోంది. కాగా, అమెరికా ఇండియన్స్, మహిళలు హెచ్4 వీసా కింద ఉద్యోగాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే హెచ్4 వీసా కింద వర్క్ పర్మిట్లను ఎత్తివేస్తామని ట్రంప్ సర్కారు బహిరంగంగా ప్రకటించడం, న్యాయస్థానంలోనూ ఫైలు దాఖలు చేసిన సంగతి విదితమే.
అమెరికన్లుగా 50 వేల మంది భారతీయులు
2017లో పౌరసత్వంపై హోం ల్యాండ్ సెక్యూరిటీ అధికారిక నివేదిక
న్యూఢిల్లీ: గతేడాది సుమారు 50వేల మంది భారతీయులు అమెరికా పౌరసత్వాన్ని పొందారు. అమెరికా పౌరసత్వాన్ని తీసుకున్న భారతీయుల సంఖ్య 2016లో కంటే గతేడాదిలో పెరిగింది. అయితే మొత్తంగా అమెరికా పౌరసత్వం పొందిన విదేశీయుల సంఖ్య గతంలో కంటే తక్కువగానే ఉండటం గమనార్హం. 50,802 మంది భారతీయులు 2017లో యూఎస్ పౌరసత్వం పొందినట్టు వార్షిక వలసల నివేదికలో హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ వెల్లడించింది. అధికంగా మెక్సికన్లు(1,18,559) అమెరికా పౌరసత్వం పొందగా, తర్వాతి స్థానంలో భారతీయులు ఉన్నట్టు తెలిపింది. మూడోస్థానంలో చైనా(37,674) దేశీయులు ఉన్నారు. 2016లో అమెరికా పౌరసత్వం తీసుకున్న భారతీయుల సంఖ్య 46,188 ఉండగా, 2015లో ఈ సంఖ్య 42,213గా ఉంది. 2017లో మొత్తం 7,07,265 మంది విదేశీయులు యూఎస్ సిటిజెన్షిప్ను పొందగా ఇదే సంఖ్య 2016లో 7,53,060గా, 2015లో 7,30,259గా ఉంది. కాగా, యూఎస్ పౌరసత్వం పొందిన భారతీయులు ఎక్కువగా కాలిఫోర్నియా (12,000మంది)లో, తర్వాత న్యూజెర్సీ(5,900), టెక్సాస్లలో నివసిస్తున్నట్టు రిపోర్టు వివరించింది.