Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాబూల్: అఫ్ఘాన్లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు. మృతుల్లో ఓ మహిళ సహా ఆరుగురు చిన్నారులు ఉన్నారని ప్రావిన్స్ గవర్నర్ అధికార ప్రతినిధి అత్తాహుల్లా ఖోగ్యానీ వెల్లడించారు. నాన్గర్హార్ ప్రావిన్స్లో ఈ ఘటన చోటుచేసుకుందని అన్నారు. అచిన్ జిల్లాలో ఓ కుటుంబం ప్రయాణిస్తున్న కారు ఉగ్రవాదులు పెట్టిన ల్యాండ్మైన్ను తాకిందని ఆయన తెలిపారు. భద్రతాదళాలను చంపే లక్ష్యంతో పెట్టిన ఈ బాంబులకు సాధారణ ప్రజలు బలయ్యారని అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు తామే బాధ్యత వహిస్తున్నట్టు ఏ ఉగ్రసంస్థ కూడా ప్రకటించుకోలేదు. నాన్గర్హర్ ప్రావిన్స్లో ఐఎస్, తాలిబన్ల ఉగ్ర కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. కాగా, అఫ్ఘాన్లో చరిత్రాత్మక పార్లమెంట్ ఎన్నికలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ ఎన్నికలను తాము బహిష్కరిస్తున్నట్టు తాలిబన్లు హెచ్చరించారు. పలు పోలింగ్ కేంద్రాల్లో శనివారం ఓటింగ్ నమోదైంది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆదివారం పోలింగ్ నిర్వహించారు. వరుస పేలుళ్లు జరగడంతో అఫ్ఘాన్ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఓటర్లకు భద్రత కల్పించడంలో అఫ్ఘాన్ ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి.