Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైలు పట్టాలు తప్పడంతో 22 మంది మృతి, 171 మందికి గాయాలు
తైపీ : తైవాన్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రైలు పట్టాలు తప్పడంతో 22 మంది మృతి చెందారు. 171 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను రైల్వే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. సమాచారం అందుకున్న ప్రత్యేక బలగాలు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. 20 ఏండ్లలో జరిగిన రైలు ప్రమాదాల్లో ఇదే అత్యంత ఘోరమైన ప్రమాదమని తైవాన్ రైల్వే శాఖ పేర్కొంది. ప్రభుత్వ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...తైపీ నుంచి టైయుంగ్ నగరానికి బయలుదేరిన పుయుమా ఎక్స్ప్రెస్ జిన్మా స్టేషన్కు సమీపంలో ప్రమాదానికి గురైంది. రైలు బయలుదేరిన సమయంలో 366 మంది ప్రయాణీకులు ఉన్నారని రైల్వే అధికారులు తెలిపారు. రైలు పట్టాలు తప్పడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఐదు బోగీలు తలకిందులయ్యాయని, మృతుల్లో ఈ బోగీల్లో ఉన్న ప్రయాణీకులే అధికంగా ఉన్నారని తైవాన్ రైల్వే చీఫ్ జేసన్ లూ వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై నేషనల్ డిఫెన్స్ అధికార ప్రతినిధి చెన్ చుంగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాద ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించామని అన్నారు. రైలు ప్రమాదానికి గురైన సమయంలో అతివేగంగా ప్రయాణించిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు ఆపిల్ డైలీ తైవాన్ మీడియా సంస్థతో చెప్పారు. తైవాన్లో జరిగిన రైలు ప్రమాదం తనను కలచివేసిందని అధ్యక్షుడు సరు ఇంగ్ వెన్ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 1991లో తైవాన్లో రైలు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 30 మంది మృతి చెందగా, 112 మంది గాయపడ్డారు.