Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికా జూపార్క్లో అరుదైన ఘటన..
వాషింగ్టన్ : అమెరికాలోని ఇండియానాపొలిస్ జంతు ప్రదర్శనశాలలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఒక మగ సింహాన్ని ఆడ సింహం చంపేసింది. 2015లో ఈ రెండు సింహాలూ కలిసి మూడు కూనలకు జన్మనిచ్చాయి. ఎనిమిదేండ్లుగా ఈ రెండూ ఒకే ఎన్క్లోజర్లో కలిసి నివసిస్తున్నాయి. జూపార్క్ అధికారులు, సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. పదేండ్ల మగ సింహం న్యాక్పై 12 ఏండ్ల ఆడసింహం జ్యురీ దాడికి పాల్పడింది. న్యాక్ మెడను గట్టిగా పట్టుకొంది. న్యాక్ కదలికలు ఆగిపోయే వరకు మెడను అలా పట్టుకొనే ఉంది. ఊపిరాడకపోవడంతో న్యాక్ మృతి చెందింది. సింహాల ఎన్క్లోజర్ నుంచి అసాధారణ స్థాయిలో గర్జనలు వినిపించడంతో అప్రమత్తమై తాము అక్కడకు చేరుకున్నామని జూ సిబ్బంది తెలిపారు. న్యాక్ మెడను జ్యురీ పట్టుకొందని చెప్పారు. రెండు సింహాలనూ విడిపించేందుకు తాము ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని వారు విచారం వ్యక్తంచేశారు. న్యాక్, జ్యురీ మధ్య ఇంతకుముందు పెద్ద గొడవలేవీ జరగలేదని జంతు ప్రదర్శనశాల నిర్వాహకులు తెలిపారు. న్యాక్ లేని లోటు తమను వెంటాడుతుందని అన్నారు. జూలోని జంతువులతో తమకు గట్టి అనుబంధం ఏర్పడుతుందని, ఏదైనా జంతువు చనిపోతే తమకు చాలా బాధ కలుగుతుందని ఇండియానాపొలిస్ జంతుప్రదర్శనశాల గార్డు డేవిడ్ హాగన్ రాయిటర్స్ వార్తాసంస్థతో వ్యాఖ్యానించారు. న్యాక్ మృతికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర సమీక్ష జరుపుతామని జూ నిర్వాహకులు తెలిపారు. జ్యురీ, మరో మూడు సింహాలు క్షేమంగా ఉన్నాయని చెప్పారు. జంతు ప్రదర్శనశాలలోని అన్ని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నామని, రెండు సింహాల మధ్య గొడవ ఎందుకు జరిగిందో దర్యాప్తు చేపడతామని అన్నారు.