Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాక్కు అమెరికా షరతు
వాషింగ్టన్ : అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ( ఐఎంఎఫ్) నుంచి అందుతున్న రుణంతో పాకిస్తాన్ చైనాకు రుణం చెల్లించకుండా చూస్తామని అమెరికా పేర్కొంది. ఈ మేరకు తమ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని వైట్హౌస్ అధికారి ఒకరు మీడియాతో చెప్పారు.దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసేలా చెల్లింపుల సంక్షోభాన్ని పాక్ ఎదుర్కొంటోంది. దీని నుంచి బయటపడేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి 800కోట్ల అమెరికన్ డాలర్లను పాకిస్తాన్ రుణంగా కోరుతోన్నది. ఇటీవల దీనికి సంబంధించి ఐఎంఎఫ్, పాకిస్తాన్ మధ్య జరిగిన సమావేశం ఎలాంటి పురోగతి లేకుండా ప్రతిష్టంభనతో ముగిసింది. పాకిస్తాన్ ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాలకు చైనా రుణమే ప్రధాన కారణమని అమెరికా భావిస్తోంది. పాకిస్తాన్కు ఇవ్వాలనుకుంటున్న ఏ నిధులైనా చైనా రుణాలను తీర్చ డానికి ఉపయోగించకుండా ఉండేలా చూడాలంటూ ఐఎంఎఫ్కు స్పష్టం చేశామని అమెరికా ఆర్థిక శాఖ సహాయ మంత్రి డేవిడ్ మాల్పాస్ కాంగ్రెస్ సమావేశంలో తెలిపారు. ఈ విషయంలో కాంగ్రెస్ సభ్యుల్లో ఆందోళనలు నెలకొన్నాయన్నారు. అంతర్జాతీయ ఆర్థిక సంస్థల సమర్ధత మదింపుపై కాంగ్రెస్ ఆర్థిక సేవల కమిటీ సమావేశంలో సభ్యుడు ఈద్ రాయిస్ మాట్లాడుతూ, ఈ పరిస్థితి రాకుండా చూస్తామని, అందులో ఎలాంటి సందేహం లేదని చెప్పారు. ఐఎంఎఫ్ రుణాలన్నీ స్వల్ప వ్యవధిలోనివి కాగా, చైనా రుణాలు దీర్ఘకాలిక వ్యవధికి చెందినవని చెప్పారు.