Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొలంబో : దేశాధ్యక్షుడు పార్లమెంట్ను రద్దు చేయడం చట్టవిరుద్ధమైందని శ్రీలంక సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. అధ్యక్షుడి చర్యలు రాజ్యాంగంలోని నియనిబంధనలకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయని ఘాటుగా చురకలంటించింది. ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఏకపక్షంగా తీర్పును వెల్లడించింది. నాలుగున్నరేండ్ల పదవీకాలం పూర్తి కాకుండానే అధ్యక్షుడు పార్లమెంటును రద్దు చేయడానికి వీలులేదని అభిప్రాయ పడింది. తీర్పు వెలువరిస్తున్న సమయంలో కోర్టు ప్రాంగణం అంతా భద్రతాదళాల అదుపులోకి వెళ్లింది. సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో ఉద్వాసనకు గురైన రాణిల్ విక్రమ్సింఘే తిరిగి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. అక్టోబర్ 26న ఆదేశ ప్రధాని రణిల్ విక్రమసింఘేను తొలగిస్తున్నట్టు అధ్యక్షుడు సిరిసేన ప్రకటించడంతో అటు రాజ్యాంగపరంగా ఇటు రాజకీయపరంగా తీవ్ర సంక్షోభం నెలకొన్నది. అంతేగాకుండా, ఆదేశ మాజీ అధ్యక్షుడు మహిందా రాజపక్సేను ప్రధానిగా నియమించడంపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత 225 సీట్లున్న పార్లమెంటును కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో అగ్నికి ఆజ్యం పోసినట్టుగా తయారైంది పరిస్థితి. పార్లమెంటు సమావేశమైన సమయంలో రాజ పక్సేకు 113 మంది ఎంపీల మద్దతు లభించకపోవడంతో ఆయనను ప్రధాని పదవి నుంచి తొలగించారు. మరోవైపు విక్రమసింఘేకు కావాల్సిన సంపూర్ణ మద్దతు ఎంపీల నుంచి లభించింది. బుధవారం పార్లమెంటులో విక్రమసింఘేకు 117 మంది ఎంపీలు మద్దతు తెలిపారు. దీంతో ఆయన బలపరీక్షలో నెగ్గారు. అదే రాజపక్సే బలనిరూపణలో విఫలమయ్యారు. ఇదిలాఉండగా దేశ ప్రయోజనాలు అక్కడి ప్రజల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని పార్లమెంటును రద్దు చేసినట్టు అధ్యక్షుడు సిరిసేన అన్నారు. అయితే కోర్టు ఇచ్చిన తీర్పును తాను గౌరవిస్తున్నట్టు తెలిపారు.
నవంబర్ 9న పార్లమెంటు రద్దు చేస్తున్నట్టు సిరిసేన ప్రకటించగానే శ్రీలంక సుప్రీంకోర్టులో దాదాపు 13 పిటిషన్లు దాఖలయ్యాయి. రాజపక్సేను ప్రధానిగా చేయాలన్న ఆంక్షతో పనిచేసి విఫలమైన సిరిసేనకు కోర్టు తీర్పు మరో షాక్ అనే చెప్పాలి. కోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో ఫిబ్రవరి 2020 వరకు దేశంలో పార్లమెంటు ఎన్నికలకు ఆస్కారం లేనట్టే.