Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దుబాయ్ : తమ దేశ కోర్టులలో మూడో అధికార భాషగా హిందీని చేర్చినట్లు అబుదాబి జ్యుడిషియల్ విభాగం శనివారం తెలిపింది. కోర్టులలో దాఖలు చేసే అన్ని రకాల దరఖాస్తులు, ఇతరఫారంలను హిందీ భాషలో కూడా స్వీకరించనున్నట్లు వెల్లడించింది. అంతకుముందు అరబిక్, ఇంగ్లీషు భాషలను ఉపయోగించే తాము ఇప్పుడు హిందీ భాషను కూడా చేర్చినట్టు డిపార్ట్మెంట్ ప్రకటించింది. దేశంలోని న్యాయప్రక్రియతో పాటు వారి హక్కులు, బాధ్యతలు గురించి తెలుసుకునేందుకు ప్రజలకు భాష అవరోధం కాకూడదన్న లక్ష్యంతో హిందీని అధికార భాషగా గుర్తించినట్లు తెలిపింది. దీనికి తోడు ఏడీజెడ్డీ వెబ్సైట్లో లభ్యమయ్యే ఏకీకృత రూపంలోని దరఖాస్తుల ద్వారా రిజిస్ట్రేషన్లకు వెసులుబాటు కల్పించినట్టు అవుతుందని వెల్లడించింది. అధికారిక గణాంకాల మేరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) జనాభా సుమారు 90 లక్షలు. అందులో 2/3 వంతు మంది ఇతర దేశాల నుండి వలస వచ్చినవారు. భారతీయుల సంఖ్య సుమారు 20 లక్షలు ఉంటుంది.