Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏప్రిల్28న నిర్వహించాలని ప్రధాని పిలుపు
- ప్రభుత్వ నిర్వహణకు వేర్పాటువాద నేతల నుంచి వ్యతిరేకత
- బడ్జెట్ ప్రతిపాదన తిరస్కరణతో అసంతృప్తిలో పెడ్రో సాంచెజ్
మాడ్రిడ్ : స్పెయిన్లో ముందస్తు ఎన్నికలకు నగారా మోగింది. వేర్పాటువాద నేతలు తమ ప్రభుత్వ నిర్వహణకు ఆటంకం కల్గిస్తున్నారని ప్రధాని పెడ్రో సాంచెజ్ తెలిపారు. ఈనేపథ్యంలో ఏప్రిల్28న ముందస్తు ఎన్నికలు నిర్వహణకు పిలుపునిస్తున్నట్టు ఆయన చేసిన ప్రకటన రాజకీయ పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. స్పానిష్ సోషలిస్ట్ వర్కర్స్ పార్టీ జనరల్ సెక్రెటరీ పెడ్రో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి కేవలం ఎనిమిది నెలలు మాత్రమే పూర్తయింది. ఆయన పాలన పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. ఆయన ప్రతిపాదించిన జాతీయ బడ్జెట్కు స్పెయిన్ పార్లమెంట్లో తగిన మద్దతు లభించలేదు. దీంతో, పార్లమెంట్ను రద్దు చేయాలని పెడ్రో నిర్ణయించుకున్నారు. పైగా, మైనార్టీ ప్రభుత్వానికి వేర్పాటువాద నేతల నుంచి ఎలాంటి సహకారం లభించడంలేదని వాపోయారు.
స్పెయిన్లో రిపబ్లికన్ లెఫ్ట్ ఆఫ్ కాటలోనియా, కాటలాన్ యూరోపియన్ డెమోక్రాటిక్ పార్టీ అనే రెండు ప్రధాన జాతీయ పార్టీలు ఉన్నాయి. ఈరెండు పార్టీల నేతలు ప్రధాని ప్రతిపాదించిన తాజా బడ్జెట్ను వ్యతిరేకించాయి. దీంతో, ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ప్రధాని పట్టుబట్టారు. 'స్పెయిన్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నదే నా సంకల్పం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించాలని నేను కోరుతున్నాను. స్పెయిన్ అభివృద్ధి కోసం ప్రతీఒక్కరూ కష్టపడి సహనంతో పనిచేయాలి. విజ్ఞతతో మెలగాలి. పరస్పర స్నేహ, గౌరవ భావాలను పెంపొందించుకోవాలి. కాటలాన్ నేషనలిస్ట్ పార్టీలు బడ్జెట్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ తమ వక్రబుద్ధిని మరోసారి చాటుకున్నాయి. అందుకే, పార్లమెంట్ను రద్దుచేయాలని నిర్ణయించుకున్నాను. ఏప్రిల్28న ఎన్నికల నిర్వహణకు పిలుపునిస్తున్నాను. నేను దేశప్రధానిగా బాధ్యతలు చేపట్టి కేవలం ఎనిమిది నెలలు మాత్రమే పూర్తయింది. ప్రాంతీయ పార్టీల మద్దతుతో పాలన కొనసాగించడం ఇబ్బందిగా మారింది. సోషలిస్ట్ వర్కర్స్ పార్టీకి చట్టసభల్లో మెజారిటీ లేకపోవడంతో ప్రాంతీయ పార్టీలపై ఆధారపడాల్సిన దుస్థితి నెలకొంది. సంకీర్ణ ప్రభుత్వం నడిపించాలంటే కష్టమే. ఎన్నికల నిర్వహణతో రాజకీయ పరిష్కారం లభిస్తుందో లేదో కాలమే నిర్ణయిస్తుంది' అని పెడ్రో అన్నారు. కన్జర్వేటివ్ పీపుల్స్ పార్టీ, సియూడడనోస్ పార్టీలు ఎవరికి మద్దతిస్తాయనే విషయంపై ఇంకనూ స్పష్టత రాలేదు. అయితే, స్పెయిన్ నుంచి విడిపోవాలని కాటలోనియాలో ఉవ్వెత్తున ఉద్యమం కొనసాగుతోంది. కాటలోనియాను స్వతంత్య్ర రాజ్యంగా గుర్తించాలనే అంశాన్ని కూడా ఎన్నికల్లో పోటీచేయనున్న అభ్యర్థులు తమ ప్రచార కార్యక్రమాల్లో ఉపయోగించుకునే అవకాశముంది. కన్జర్వేటివ్ పీపుల్స్ పార్టీ, సియూడడనోస్, వాక్స్ పార్టీలు కాటలోనియాకు స్వాతంత్య్రం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే, స్పెయిన్ నుంచి కాటలోనియాను విడతీయొద్దంటూ ఓ వర్గానికి చెందిన ప్రజలు కొద్దిరోజులుగా భారీ ర్యాలీలు తీస్తున్నారు. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ వీధుల్లోకి చేరుకొని నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. 2016, జూన్23న యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలిగిన సంగతి తెలిసిందే. ఈయూ నుంచి బ్రిటన్ విడిపోవాలని 51.9 శాతం మంది ఓటర్లు ప్రజాభిప్రాయ సేకరణలో తమ ఓటును నమోదు చేశారు. మెజారిటీ ఓటర్లు బ్రెగ్జిట్కు మద్దతుగా ఓటేశారు. ఈఏడాది మార్చి 29న ఈయూ నుంచి బ్రిటన్ విడిపోయే అవకాశముంది. బ్రెగ్జిట్ ప్రక్రియ ఇంకనూ పూర్తికాకపోయినప్పటికీ బ్రిటన్ ఆర్థికంగా నష్టపోయిందని పలువురు విమర్శిస్తున్నారు. బ్రెగ్జిట్ ప్రక్రియ కారణంగా బ్రిటిషర్లు ఇబ్బందిపడుతున్నారని స్పెయిన్ నిరసనకారులు అభిప్రాయపడ్డారు. స్పెయిన్ నుంచి తాము విడిపోవాలని భావించడంలేదని చెప్పారు. స్పెయిన్ నుంచి కాటలోనియాను విడదీయాలని కుట్ర పన్నిన నేతలందరినీ అరెస్ట్ చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. 2017లోని కాటలోనియాకు స్వాతంత్య్ర రాజ్యంగా గుర్తించాలనే అంశం తెరపైకి వచ్చి విఫలమైందని అన్నారు. కాటలోనియన్లను రెచ్చగొట్టి ఉద్యమకారులుగా మార్చిన 12 మంది నేతలపై దేశద్రోహం కేసులు నమోదై ఉన్నాయి.
స్పెయిన్లో 2020, జులై 26న ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, ప్రధాని ముందస్తు ఎన్నికలకు పిలుపునిచ్చారు. ఏప్రిల్28న ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. 350 మంది కాంగ్రెస్ డిప్యూటీలను, 208 సెనెటర్లను ఎన్నికల్లో ఎన్నుకోనున్నారు. 2016లో జరిగిన ఎన్నికల్లో పీపుల్స్ పార్టీ మైనార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. స్పెయిన్ ప్రధానిగా పెడ్రో గతేడాది జూన్2న బాధ్యతలు చేపట్టారు.