Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కీలక పురోగతి సాధించాం
- చైనా, అమెరికా వాణిజ్య చర్చలపై జిన్పింగ్
బీజింగ్ : రెండు రోజుల పాటు చైనా, అమెరికాల మధ్య జరిగిన ఉన్నతస్థాయి వాణిజ్య చర్చలు శుక్రవారంతో ముగిశాయి. ఈ చర్చలతో ''ప్రస్తుత దశలో కీలక పురోగతి'' సాధించినట్టు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ వ్యాఖ్యానించారు. అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లితిజర్, ఆర్ధిక మంత్రి స్టీవెన్ నుచిన్లతో ఆయన శుక్రవారం భేటీ అయ్యారు. నేటి ప్రపంచంలో చైనా, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు అతి ముఖ్యమైన ద్వైపాక్షిక సంబంధాల్లో ఒకటని ఆయన పేర్కొన్నారు.
ఇరు దేశాలు స్థూలంగా ఉమ్మడి ప్రయోజనాలు కలిగి వున్నాయన్నారు. పైగా ప్రపంచ శాంతి, సుస్థిరతలను పరిరక్షించే గురుతర బాధ్యత ఈ దేశాలపై వుందన్నారు. అదే సమయంలో ప్రపంచ దేశాల అభివృద్ధి, సంక్షేమాన్ని పెంపొందింప చేయడం కూడా ముఖ్యమని అన్నారు. సమన్వయం, సహకారం, సుస్థిరతతో కూడిన సంబంధాలను కలిసి ముందుకు తీసుకెళ్ళడానికి గత డిసెంబరులో ట్రంప్తో జరిగిన సమావేశంలో ఏకాభిప్రాయానికి వచ్చామని చెప్పారు.
ఈ చర్చల సందర్భంగా ఇరు బృందాలు పరస్పర సమాచార మార్పిడిని మరింత బలోపేతం చేసుకున్నాయని, సహకారంపై దృష్టి కేంద్రీకరించాయని, సూత్రప్రాయంగా విభేదాలను పరిష్కరించుకునే ప్రయత్నం జరిగిందని జిన్పింగ్ చెప్పారు. చైనా, అమెరికాలను ఒకదాన్నుండి మరోదాన్ని వేరు చేయలేమని పునరుద్ఘాటించారు.
కేవలం సహకారం ద్వారా మాత్రమే ఇరువురికీ ప్రయోజనం కలుగుతుందని, అందులో ఎలాంటి సందేహం లేదని అన్నారు. సహకారం కాకుండా ఘర్షణ పడడం వల్ల ఇరువురూ నష్టపోయే పరిస్థితి తలెత్తుతుందన్నారు. 'ఇరు పక్షాలకూ సహకారమే మంచి అవకాశం, ఉత్తమ మార్గం' అని జిన్పింగ్ స్పష్టం చేశారు. వాణిజ్యంలో విభేదాలు, ఒత్తిళ్ళకు సంబంధించి మాట్లాడుతూ, సహకారంతో వాటిని పరిష్కరించుకోవడానికి చైనా సిద్ధంగా వుందన్నారు. ఉభయ పక్షాలకు ఆమోదయోగ్యమైన ఒప్పందం కుదుర్చుకోవాలని ఆకాంక్షించారు.