Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్ : బ్రిటన్ ప్రతిపక్ష లేబర్పార్టీకి చెందిన ఏడుగురు ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేశారు. పార్టీ చీఫ్ కార్బిన్ అనుసరిస్తున్న విధానాలు నచ్చకపోకవడంతోనే తాము రాజీనామా చేసినట్టు ఎంపీలు ఆరోపించారు. కాగా, యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ మార్చి29న వైదొలగనున్న సంగతి తెలిసిందే. బ్రెగ్జిట్ ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తిచేయాలని ప్రధాని థెరిసా మే ఆకాంక్షిస్తున్నారు. అన్ని పార్టీల సభ్యులను కలుపుకొని వెళ్లాలని భావిస్తున్నారు. పార్లమెంట్ ఓటింగ్లో బ్రెగ్జిట్కు అనుకూలంగా ఓటు నమోదు చేయాలని కోరుతున్నారు. ఇలాంటి తరుణంలో ఏడుగురు ఎంపీల రాజీనామాలు కొత్తచిక్కులు తెచ్చిపెట్టాయి. రాజీనామాలు చేసిన ఎంపీలు లండన్లో సమావేశమై మాట్లాడారు. లేబర్ పార్టీ చీఫ్ని విమర్శించారు. ఆయన అనుసరిస్తున్న విధానాలపై వ్యతిరేకతతోనే తాము రాజీనామా చేసినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాజీనామాలు చేసిన లేబర్పార్టీ ఎంపీలు చుకా ఉమున్నా, లూసియానా బెర్జర్, క్రిస్ లెస్లీ, ఏంజెలా స్మిత్, మైక్ గేప్స్, గావిన్ షుకర్, ఆన్ కాఫీ తదితరులు పాల్గొన్నారు. ఇదిలాఉండగా, లేబర్పార్టీ ఎంపీల రాజీనామాలపై కార్బిన్ స్పందించారు. ' బ్రిటన్లో లేబర్పార్టీ క్రమక్రమంగా బలపడుతున్నది. 1945 నుంచి ఓట్ల నమోదు శాతం పెంచాం. లేబర్పార్టీ విధానాల పట్ల ప్రజల్లో నమ్మకముంది. తమ విధానాలతో ఇమడిలేకపోవడంతోనే ఏడుగురు ఎంపీలు రాజీనామా చేశారు. వీరి రాజీనామాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాను. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లేబర్పార్టీ విధానాలను రూపొందిస్తూ ఉంటుంది' అని అన్నారు.