Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇస్లామాబాద్: జమ్ముకాశ్మీర్లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఆత్మాహుతి దాడి ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఏ ఆధారాలు ఉన్నాయని పాక్ను దోషిగా చూపుతున్నారని భారత్ను ప్రశ్నించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. భారత నిఘా వర్గాలు తమను నిందించే బదులు ఈ ఘటనతో పాక్కు సంబంధాలున్నట్టు ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. పుల్వామా దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని ఇమ్రాన్ వెల్లడించారు. పాక్పై భారత్ అన్యాయంగా ఉగ్రవాద ముద్ర వేసిందని తన ఆక్రోశాన్ని వెల్లగక్కారు. ఇలాంటి దాడిని పాకిస్థాన్ ప్రతిఘటిస్తుందని ఇమ్రాన్ చెప్పారు. భారత్ వైపు నుంచి ఎలాంటి దాడి జరిగినా పాక్ బలగాలు తిప్పిగొడతాయని హెచ్చరించారు. భారత్పై దాడి చేస్తే తమకేలాంటి ప్రయోజనం ఉండదని అన్నారు. పాక్ ఉగ్రవాదాన్ని కాదు...స్థిరత్వాన్ని కోరుకుంటుందని అన్నారు. ఈ దాడికి సంబంధించి ఆధారాలు తమకు అందజేసినట్టయితే పారదర్శకంగా విచారణ చేపడతామని ఇమ్రాన్ భరోసా ఇచ్చారు. పాక్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ దాడులకు పాల్పడే మిలిటెంట్లతో తమ దేశ అంతర్గత భద్రతకు కూడా ప్రమాదమేనని అన్నారు. ఉగ్రవాదం అంశంపై భారత్తో శాంతి చర్చలకు తామెప్పుడూ సిద్ధమేనని అన్నారు. యుద్ధాన్ని ప్రారంభించడం మన చేతుల్లోనే ఉంటుంది. కానీ ఒక్కసారి యుద్ధం ప్రారంభమైనట్టయితే దాని ముగింపు దేవుడి చేతుల్లోనే ఉంటుందని అన్నారు. యుద్ధం తదనంతర పరిణామాలు భీతావహంగా ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఇమ్రాన్ భారత్ను హెచ్చరించారు. సరిహద్దుల్లో శాంతిసామరస్యాలు ఇప్పుడిప్పుడే నెలకొంటున్నాయని, ఇలాంటి సమయంలో దాడి చేయాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. పాకిస్థాన్పై అర్థరహిత ఆరోపణలు చేయడం మానుకోవాలని ఇమ్రాన్ భారత్ను కోరారు. ఇదిలా ఉండగా, గతవారం పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వారుపై ఆత్మాహుతి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. ఈ ఘటన అనంతరం భారత్, పాక్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాకిస్థాన్కు చెందిన జైష్-ఎ- మహ్మద్ ఉగ్రసంస్థ సభ్యుడు పుల్వామాలో ఆత్మాహుతి దాడికి పాల్పడిందని లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ ధిల్లన్ తెలిపారు. జైష్-ఎ-మహ్మద్ ఉగ్రసంస్థ చీఫ్ మసూద్ అజర్ సహా పలువురు కీలక సభ్యులు పాకిస్థాన్లో నివసిస్తూ కార్యకలాపాలు చేపడుతున్నారని అన్నారు. నిషేధిత ఉగ్రసంస్థల జాబితాలో జైష్-ఎ-మహ్మద్ సంస్థను చేర్చాలని డిమాండ్ చేశారు. మసూద్ అజర్ను తక్షణమే అరెస్ట్ చేసి విచారించాలని అన్నారు. సీఆర్పీఎఫ్ బలగాలపై ఆత్మాహుతి దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు.