Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అపహరణ, దారుణ హత్యకు గురైన ఆరేండ్ల చిన్నారి
- దోషులను ఉరితీయాలని నిరసనకారుల డిమాండ్
కాబూల్ : అఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లో ఆరేండ్ల చిన్నారి అపహరణ, దారుణ హత్య కలకలం సృష్టించింది. చిన్నారి పట్ల అమానవీయంగా ప్రవర్తించి హతమార్చిన దుండగులను ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ గురువారం దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. కాబూల్ పోలీస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... మహ్సా (6) అనే చిన్నారి ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా కొందరు గుర్తుతెలియని దుండగులు అపహరించారు. చిన్నారిని క్షేమంగా వదలిపెట్టాలంటే 300,000 డాలర్లు (రూ. 2 కోట్ల ఎనిమిది లక్షలు) చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బాలిక తల్లి దండ్రులకు ఫోన్ చేశారు. అజ్ఞాత వ్యక్తుల ఫోన్కాల్పై తల్లి దండ్రులు ఏమాత్రం స్పందించలేదు. దీంతో, ఆగ్రహానికి గురైన దుండగులు బాలికను దారుణంగా హతమార్చారు. ఈ ఘటనపై కాబూల్లో నిరసన జ్వాలలు భగ్గుమన్నాయి. చిన్నారిని హతమార్చిన దుండగులను బహిరంగంగా ఉరితీయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. చిన్నారి హత్యకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. కాగా, ఈకేసులో ఇద్దరు అనుమానితులను అరెస్ట్ చేసినట్టు కాబూల్ పోలీసులు తెలిపారు. నిందితులిద్దరూ తమ నేరాన్ని అంగీకరించారని అన్నారు. ఈ ఘటనపై అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహ్సా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.