Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆన్లైన్ వ్యాపార ప్రకటనల్లో చట్టాన్ని అతిక్రమించిన సోషల్ మీడియా దిగ్గజం
- రూ. 11,707 కోట్లు చెల్లించాలని ఈయూ ఆదేశం
లండన్: ఆన్లైన్ వ్యాపార ప్రకటనల రంగంలో చట్టాన్ని అతిక్రమించిన ఆరోపణలపై టెక్ దిగ్గజ సంస్థ గూగుల్కు ఈయూ 1.49 బిలియన్ యూరోల (రూ. 11,707 కోట్లు) భారీ జరిమానా విధించింది. గూగుల్ పై కమిషన్ ఇలా యాంటీ ట్రస్ట్ జరిమానా వేయడం ఇది మూడోసారి. సిలికాన్ వ్యాలీ దిగ్గజం వ్యాపారంపై రెండు ఇతర ప్రాంతాల్లో వేర్వేరుగా జరిగిన దర్యాప్తుల్లో కూడా గూగుల్ పై కమిషన్ జరిమానా వేసింది. గూగుల్ యాడ్ సెన్స్ వ్యాపార ప్రకటన వ్యాపారంపై సుదీర్ఘ కాలంగా సాగుతున్న దర్యాప్తు వివరాలను ఈయూ పోటీ కమిషనర్, మార్గరెట్ వెస్టేజర్ బుధవారం బ్రస్సెల్స్ లో ప్రకటించారు. 'తన ఆధిపత్యాన్ని దుర్వినియోగ పరచి గూగుల్ వెబ్ సైట్లు తన యాడ్ సెన్స్ ప్లాట్ ఫామ్ తప్ప ఇతర బ్రోకర్లను ఉపయోగించకుండా అడ్డుపడటంపై బుధవారం నిర్ణయం ప్రకటిస్తున్నట్టు' వెస్టేజర్ తెలిపారు. గూగుల్, దాని మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ఈయూ యాంటీ ట్రస్ట్ నియమాలను ఉల్లంఘించినట్టు కమిషన్ గుర్తించింది. తమ యాడ్ సెన్స్ ఉపయోగించే వెబ్ సైట్ల కాంట్రాక్టుల్లో నిర్బంధ నిబంధనలు విధించి గూగుల్ ప్రత్యర్థులు ఈ సైట్లలో తమ ప్రకటనలు పెట్టకుండా అడ్డుకున్నాయని పేర్కొంది. 'తన ప్రత్యర్థులు తమ నూతన ఆవిష్కరణలు, శక్తిసామర్థ్యాల ద్వారా మార్కెట్లో పోటీపడే అవకాశాన్ని గూగుల్ నిరోధించిందని' వెస్టేజర్ అన్నారు. 'దీంతో ప్రకటనకర్తలు, వెబ్ సైట్ యజమానులకు ఎంపిక చేసుకొనేందుకు ఎక్కువ ప్రత్యామ్నాయాలు లేక ఆయా అధిక ధరలను తమ వినియోగదారులకు బదలాయించక తప్పలేదని' వివరించారు.