Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికా దురాక్రమణను అడ్డుకోవాలి
- ప్రపంచ కార్మిక సంఘాల సమాఖ్య సదస్సు తీర్మానం
కార్కస్: వెనెజులాపై అమెరికా దురాక్రమ ణను, సామ్రాజ్యవాదాన్ని అడ్డుకోవాలని 'ప్రపంచ కార్మిక సంఘాల సమాఖ్య'(డబ్ల్యూఎఫ్టీయూ) పిలుపునిచ్చింది. భారత్లోని కార్మికశక్తి వెనెజులా ప్రజలకు అండగా నిలబడుతుందని న్యూఢిల్లీలో జరిగిన డబ్ల్యూఎఫ్టీయూ సమాఖ్య సదస్సు తీర్మానం చేసింది. వెనెజులాలో ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన మదురో (బోలివేరియన్ రిపబ్లిక్ ఆఫ్ వెనెజులా) ప్రభుత్వాన్ని కూల్చేయాలని అమెరికా అనేక కుట్రలు, కుతంత్రాలు చేస్తోందని సదస్సులో పాల్గొన్నవారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమెరికా సామ్రాజ్యవాదాన్ని, నయాఉదారవాద విధానాల్ని నిరసిస్తూ డబ్ల్యూఎఫ్టీయూ నేతృత్వంలో జరిగిన సదస్సు తీర్మానంచేసింది. ఈ సందర్భంగా సదస్సులో పాల్గొన్న సీఐటీయూ, ఏఐటీయూసీ, ఏఐయూటీయూసీ, ఏఐసీసీటీయూ, యూటీయూసీ, టీయూసీసీ, డబ్ల్యూఎఫ్టీయూ అనుబంధ కార్మిక సంఘాలు మదురో ప్రభుత్వానికి, అక్కడి ప్రజలకు సంఘీభావం తెలిపాయి. ఈ సందర్భంగా సదస్సులో సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ మాట్లాడుతూ, ''అమెరికా సామ్రాజ్యవాద శక్తులు మనదేశంలోనూ తమ నయా ఉదారవాద విధానాల్ని బలవంతంగా తీసుకొచ్చారు. నేడు కార్మికరంగంలో నెలకొన్న పరిస్థితులకు ఇదే ముఖ్య కారణం. అవే అమెరికా సామ్రాజ్యవాద శక్తులు నేడు వెనెజులాపై పడ్డాయి. ఆ దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయాలని చూస్తున్నాయి. వెనెజులా ప్రజల్ని కష్టాల్లోకి నెట్టాలని చూస్తున్నారు. అమెరికా కుయుక్తుల్ని, కుతంత్రాల్ని అడ్డుకునేందుకు భారత్లోని కార్మిక శక్తి కదలాలి. వెనెజులా ప్రజలకు సంఘీభావం తెలపాల్సిన అవసరముంది''అని అన్నారు.
అమెరికా ఒత్తిడికి లొంగిన మోడీ సర్కార్
వెనెజులా విషయంలో మోడీ సర్కార్ అనుసరించిన విదేశాంగ విధానాన్ని సదస్సు తీవ్రంగా ఖండించింది. అమెరికా ఒత్తిడిమేరకు ఆ దేశం నుంచి చమురు కొనుగోలు చేయటం లేదనీ, తద్వారా భారతదేశ ప్రయోజనాల్ని కూడా దెబ్బతీశారనీ సదస్సు తీర్మానంలో పేర్కొన్నారు. వెనెజులా పాలకుల్ని ఎన్నుకునే హక్కు ఆ దేశ ప్రజలకు ఉందనీ, ఆ దేశ రాజకీయాల్లో అమెరికా కలుగజేసుకోవాల్సిన అవసరం లేదనీ తెలిపారు. భారత్ తన స్వతంత్ర విదేశాంగ విధానంతో వెనెజులాతో మంచి ఆర్థిక, రాజకీయ సంబంధాలు ఏర్పరచుకోవాలని సదస్సు డిమాండ్ చేసింది.