Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇస్లామాబాద్: ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్కు సూచించిన అమెరికా.. భారత్పై మరో ఉగ్రదాడి జరిగిన పక్షంలో పరిస్థితులు తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తమ దేశంలో జిహాదీ సంస్థలు, మతవాద సంస్కృతులకు తావులేదని అన్నారు. ఇటీవల అమెరికా చేసిన హెచ్చరికపై ఆయన సూటిగా మాట్లాడడానికి ఒప్పుకోలేదు. 'పాక్ ఓ పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఒకవైపు, జైషే మహ్మద్ ఉగ్రవాదులు తామే పుల్వామా ఉగ్రదాడి చేశామని ఒప్పుకున్న నేపథ్యంలో భారత్.. మాపై తప్పుడు నిందలు వేస్తోంది. మరోవైపు, ఇతర ప్రాంతాలపై దాడి చేయడానికి మా దేశ భూభాగాన్ని ఉగ్రవాద సంస్థలు వినియోగించుకుంటున్నాయని ఇరాన్ ఆరోపిస్తోంది' అని వ్యాఖ్యానించారు. 'పాకిస్థాన్ శాంతికాముక దేశం మాత్రమే కాదు. స్వల్ప, దీర్ఘకాల విధానాల ద్వారా దేశంలో జిహాదీ సంస్కృతిని, ఉగ్రవాదాన్ని తొలగించడానికి పాక్ నిబద్ధతతో ప్రయత్నాలు జరుపుతోంది. మా ప్రభుత్వం కృషి చేస్తోంది. దేశంలో ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి జాతీయ కార్యాచారణ ప్రణాళిక (ఎన్ఏపీ) అమలు చేయడానికి పాక్లోని అన్ని పార్టీలు అంగీకరించాయి' అని ఇమ్రాన్ అన్నారు.
కాగా, జమ్ముకాశ్మీర్లోని పుల్వామాలో జైషే మహ్మద్ ఉగ్రవాది జరిపిన దాడిలో 40 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ తర్వాత భారత్.. పాక్లోని బాలాకోట్పై దాడి చేయడంతో ఇటీవల ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.