Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హెలికాప్టర్లను ఢీకొనడంతో ముగ్గురి మృతి,నలుగురికి గాయాలు
- టేకాఫ్ అవుతుండగా ప్రమాదం
- లుక్లా విమానాశ్రయంలో ఘటన
ఖాట్మండ్ : నేపాల్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఎవరెస్ట్ శిఖరానికి సమీపంలోని లుక్లా విమానాశ్రయం ( టెన్జింగ్ హిల్లరీ ఎయిర్పోర్ట్) నుంచి సమ్మిట్ ఎయిర్కు చెందిన 9ఎన్-ఏఎంహెచ్ విమానం టేకాఫ్ అవుతుండగా ప్రమాదవశాత్తూ అక్కడి హెలిప్యాడ్లో నిలిపివున్న రెండు హెలికాప్టర్లను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. ఏవియేషన్ అధికారి రాజ్కుమార్ చటర్జీ తెలిపిన వివరాల ప్రకారం.... 9ఎన్-ఏఎంహెచ్ విమానం లుక్లా నుంచి ఖట్మాండ్కు ఆదివారం బయల్దేరింది. టేకాఫ్ అవుతున్న సమయంలో రన్వేపై నుంచి అదుపుతప్పిన విమానం నేరుగా సమీపంలోని హెలిప్యాడ్లో నిలిపివున్న రెండు హెలికాప్టర్లను ఢీ కొట్టింది. ఈ ఘటనలో విమానం కోపైలట్ ధుంగానా, హెలికాప్టర్ల దగ్గర విధులు నిర్వర్తిస్తున్న ఎస్సైలు రామ్బహాదూర్ ఖాద్కా, రుద్ర బహాదూర్ శ్రేష్టా మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. విమాన అటెండెంట్, నలుగురు ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్టు సమాచారం. విమాన ప్రమాదం సంభవించిన సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా, ప్రపంచంలో ఎత్తయిన పర్వత శిఖరాల్లో ఒకటైన ఖొమొలాంగ్మాకు లుక్లా విమానాశ్రయం అతి సమీపంలో ఉంటుంది. దీంతో, ప్రతీఏడాది ఏప్రిల్ నెలలో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇదిలా ఉండగా, ఈఏడాది ఫిబ్రవరిలో నేపాల్లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం సంభవించింది. ఈప్రమాదంలో పర్యాటక మంత్రి సహా ఏడుగురు మృతి చెందారు. ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్ కూలిపోయినట్టు దర్యాప్తు బృందాలు తేల్చి చెప్పాయి.