Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్: ఐరోపాలో భీకర దాడులకు ఐఎస్ కుట్ర పన్నిందని బ్రిటిష్ మీడియా తెలిపింది. నాలుగేండ్ల కిందట ఓ కాన్సర్ట్ హాల్పై దాడి చేసి, 130 మందిని బలిగొన్న తరహాలోనే మళ్ళీ దాడులు చేసేందుకు కుట్ర జరుగుతోందని పేర్కొంది. 'సండే టైమ్స్' ప్రచురించిన కథనంలో ఐఎస్ కుట్రలకు సంబంధించిన వివరించింది. 2015 నవంబరులో జరిగిన దారుణాలను తలపిస్తూ మళ్ళీ పేట్రేగిపోయేందుకు ఐఎస్ కుట్ర పన్నుతోందని ఈ పత్రిక కథనం తెలిపింది. ఐరోపా, మధ్య ప్రాఛ్య దేశాల్లో ఈ దాడులకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిపింది. ఈ ఏడాది ప్రారంభంలో సిరియాలోని ఐఎస్ చిట్ట చివరి స్థావరం సమీపంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఐఎస్ ఉగ్రవాదులు ఓ హార్డ్ డ్రైవ్ను వదిలి పారిపోయారు. దీనిని పరిశీలించినప్పుడు అనేక దారుణమైన ప్రణాళికలు వెల్లడయ్యాయి. వీటిలో కొన్నిటిని ఐరోపాలో అమలు చేయబోతున్నట్టు ఈ పత్రిక కథనం పేర్కొంది. విదేశాల్లో జరిగే ఉగ్రవాద కార్యకలాపాలకు ఐఎస్ సభ్యుడు అబు ఖబాబ్ అల్ ముహజిర్ ఆదేశాలు ఇస్తాడని తెలిపింది. కాగా, 2015 నవంబరులో పారిస్లో భీకర ఉగ్రవాద దాడులు జరిగాయి. పారిస్తోపాటు శివారులో ఉన్న సెయింట్-డెనిస్పై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. స్టేడ్ డీ ఫ్రాన్స్ స్టేడియంలో ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ముగ్గురు ఆత్మాహుతి బాంబర్లు స్టేడియం బయట తమను తాము పేల్చుకున్నారు. అనంతరం వరుసగా మరికొందరు కాల్పులు జరిపారు. రెస్టారెంట్లపై కూడా ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. బటాక్లాన్ కాన్సర్ట్ హాల్పై జరిగిన ఉగ్రవాద దాడిలో 130 మంది మృతి చెందారు.