Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదుగురి మృతి, 17 మంది గల్లంతు
కాబూల్ : అఫ్ఘనిస్థాన్లో గత కొద్ది రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. వరదల్లో చిక్కుకొని ఐదుగురు మృతి చెందగా, మరో 17 మంది ఆచూకీ లభ్యం కాలేదు. ప్రత్యేక బృందాలు గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు చేపట్టాయి. స్థానిక అధికారి ముబారెజ్ తెలిపిన వివరాల ప్రకారం..హెరాత్ ప్రావిన్స్లో భారీ వర్షాలు కురుస్తు న్నాయి. వరద ప్రవాహంలో కొట్టుకొని పోయి ఐదుగురు మృతిచెందారు. వ్యానులో ప్రయాణిస్తున్న 17 మంది గల్లంతయ్యారు. అఫ్ఘాన్లోని మొత్తం 34 ప్రావిన్స్ల్లోని 16 ప్రావిన్స్ల్లో వరద ఉధృతి అధికంగా ఉందని ప్రభుత్వం ప్రకటించింది. వరద ప్రవాహంలో వందలాది ఇండ్లు కొట్టుకొనిపోయాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. రోడ్లపై వరద నీరు వచ్చిచేరడంతో రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు ఆదేశించారు. వరద ఉధృతి అధికంగా ఉన్న ప్రాంతాల్లోని ప్రజలు స్కూళ్లలో, మసీదుల్లో తలదాచుకుంటున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నట్టు ప్రభుత్వ అధికారులు తెలిపారు.