Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 850 ఏండ్ల నాటి చర్చిలో చెలరేగిన మంటలు
- పునర్ నిర్మాణం కోసం విరాళాలు : ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రన్
పారిస్ : ఫ్రాన్స్ రాజధాని పారిస్లోని పురాతనమైన నోటర్ డేమ్ క్యాథడ్రల్ చర్చి భారీ అగ్ని ప్రమాదానికి గురైంది. మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో చర్చి గోపురం, పైకప్పు కూలిపోయాయి. అయితే, అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. రెండు బెల్ టవర్స్ సహా ప్రధాన నిర్మాణాన్ని కాపాడగలిగినట్టు అధికారులు తెలిపారు. ఫ్రాన్స్లో అత్యంత ప్రముఖమైన కట్టడాల్లో నోటర్ డేమ్ క్యాథడ్రల్ చర్చి ఒకటి. 850 ఏండ్ల కిందటి గోథిక్ శైలిలో దీన్ని నిర్మించారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు చర్చిలో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పేశారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. చర్చిలో కొసాగుతున్న పునర్ నిర్మాణ పనులు మంటలకు కారణమై ఉండొచ్చని అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయేల్ మాక్రన్ తాజా ప్రమాదాన్ని 'పెను విషాదం'గా వర్ణించారు. క్యాథడ్రల్ని తిరిగి నిర్మిస్తామని, దీని కోసం అవసరమైతే అంతర్జాతీయంగా విరాళాలు సేకరిస్తామని అన్నారు.
స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... భారతీయ కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 10 గంటలకు క్యాథడ్రల్ చర్చీలో చెలరేగిన మంటలు దావానలంలా పైకప్పు వరకు వ్యాపించాయి. చర్చిలోపలి భాగాలన్నీ కలపతో తయారు చేశారు. గాజు కిటీకీలు మంటల తీవ్రతకు కాలిపోయాయి. దీంతో కప్పుతోపాటు పైనున్న గోపురం కూలిపోయింది. ఒక బెల్ టవర్ను రక్షించేందుకు సుమారు 500 మంది అగ్నిమాపక సిబ్బంది శ్రమించారు. నాలుగు గంటల తర్వాత ప్రధాన కట్టడం మంటల్లో కాలిపోకుండా కాపాడగలిగామని అగ్నిమాపక శాఖ చీఫ్ జీన్క్లాడ్ గాలెట్ ప్రకటించారు.మరమ్మతుల పనుల కోసం చర్చిలోని కొన్ని భాగాల్లో కర్రల నిర్మాణాలున్నాయి. గత వారం 16 రాగి విగ్రహాలను వేరే చోటుకు తరలించామని పారిస్ డిప్యూటీ మేయర్ ఎమ్మానుయెల్ జార్జోరీ తెలిపారు. అమూల్యమైన వారసత్వ సంపద నాశనమైపోయిందని చరిత్రకారుడు క్యామిల్ పాస్కల్ ఆందోళన వ్యక్తం చేశారు. శతాబ్దాలుగా ఎన్నో సంతోషకరమైన, దురదృష్టకరమైన ఘట్టాలకు క్యాథడ్రల్ చర్చి నిలువెత్తు సాక్షిగా నిలిచిందని చెప్పారు. క్యాథడ్రల్ చర్చీ మంటల్లో కాలిపోతున్న సమయంలో పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న వేలాది మంది గుమిగూడారు. కొందరు కన్నీళ్లు పెట్టుకోగా, మరికొందరు ప్రార్థన గీతాలు ఆలపించారు. క్యాథడ్రల్ చర్చి మంటల్లో కాలిపోవడం చూస్తుంటే భయంకరంగా అనిపించిందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. 'ట్యాంకర్ విమానాలతో నీళ్లు చల్లడం వల్ల మంటలు ఆర్పవచ్చు, త్వరగా చర్యలు తీసుకోవాలి' అని ట్వీట్ చేశారు.
పునర్ నిర్మాణం కోసం భారీ విరాళం : యూనెస్కో వారసత్వ సంపద క్యాథడ్రల్ చర్చి పునర్ నిర్మాణం కోసం 340 మిలియన్ డాలర్లు
( రూ.23,66,253 కోట్లు ) అందజేయనున్నట్టు ఫ్రాన్స్కు చెందిన బిలియనీర్లు బెర్నార్డ్ అర్నాల్ట్, ఫ్రాంకోయిస్ పినాల్ట్ ప్రకటించారు.
'క్యాథడ్రల్ మంటల్లో కాలిపోతుంటే ఫ్రాన్స్తో పాటు ప్రపంచ దేశాలన్నీ విలపించాయి. ఈ దుర్ఘటన ప్రతీ క్షణం కండ్లలో మెదులుతూ ఉంటుంది'
- ప్యారిస్ ఆర్చ్బిషప్ మైకెల్ అపేటిట్
క్యాథడ్రల్ చర్చిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం పట్ల ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటేరస్, ఈయూ కౌన్సిల్ అధ్యక్షుడు డొనాల్ట్ టస్క్, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఇరాన్ విదేశాంగ మంత్రి మహ్మద్ జావెద్ జరీఫ్ తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
క్యాథడ్రల్ చర్చి ప్రత్యేకతలు
- ఏటా 1.3 కోట్ల మంది ఈ చర్చిని సందర్శిస్తుంటారు. ఈఫిల్ టవర్ కన్నా ఈ చర్చికే సందర్శకుల తాకిడి అధికంగా ఉంటుందని పారిస్ పర్యాటక శాఖ పేర్కొంది.
- 12, 13వ శతాబ్దాల్లో నిర్మించిన ఈ చర్చిని యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించింది.
- ఈచర్చి పైకప్పులో ఎక్కువ భాగాన్ని కలపతోనే నిర్మించారు.
- ఈఫిల్ టవర్ నిర్మాణం జరిగి కేవలం శతాబ్దమే అయింది. క్యాథడ్రల్ నిర్మాణం క్రీ.శ.1200లో జరిగింది.