Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫ్రాన్స్లోని పలు నగరాలకు చేరుకున్న నిరసనకారులు
- కార్మికులు, పెన్షనర్లపై పన్నుల భారం తగ్గించాలని డిమాండ్
పారిస్ : ఫ్రాన్స్లో పసుపు కోటు(యెల్లో వెస్ట్) ఉద్యమం నిరాటంకంగా కొనసాగు తున్నది. 850ఏండ్ల చరిత్ర కలిగిన నోట్రే డేమ్ భవనం అగ్ని ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేస్తూనే మేక్రాన్ ప్రభుత్వ ఆర్థిక విధానాలపై ఉద్యమాన్ని ఆపేది లేదని నిరసనకారులు తేల్చిచెప్పారు. శనివారం పారిస్తోపాటు దేశంలోని పలు నగరాల్లో 'పసుపు కోటు' ఉద్యమం ఉధృతంగా సాగింది. వివిధ ప్రాంతాల నుంచి బయల్దేరిన వేలాదిమంది నిరసనకారులు తూర్పు పారిస్లోని 'డి లా రిపబ్లిక్ ప్లాజా' దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిని మార్గమధ్యంలోనే అడ్డుకునేందుకు నగర శివార్లలో పలుచోట్ల పోలీసులు రంగం సిద్ధంచేశారు. మధ్య పారిస్లోని 'ప్రెసిడెంట్ ప్యాలెస్' వైపు వెళ్తున్న వేలాదిమందిని పోలీసులు అడ్డుకున్నారు.
వేలసంఖ్యలో నగరంలోని రోడ్లమీదకు వచ్చిన నిరసనకారుల్ని చెదరగొట్టడానికి పోలీసులు భాష్పవాయును ప్రయోగించారు. 126 మందిని అదుపులోకి తీసుకున్నారు. అధ్యక్షుడు మేక్రాన్ నాయకత్వతీరు, ఆయన ఎంచుకున్న ఆర్థిక విధానాల్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమం ఊపందుకున్న సంగతి తెలిసిందే.
ప్రతి శనివారం దేశంలోని వివిధ నగరాల్లో నిరసనకారులు ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తూ శాంతియుతంగా ఆందోళనను నిర్వహిస్తున్నారు. ఆర్థిక అసమానతలు పెరిగాయనీ, సంక్షేమం పక్కకు వెళ్లిందనీ, ఇంధన ధరలపై పన్నులు పెంచటాన్ని నిరసిస్తూ జరుగుతున్న ఈ ఉద్యమం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. శనివారంనాటితో ఉద్యమం 23వారాలకు చేరుకుంది. నిరసనల నేపథ్యంలో పలు నగరాల్లో పెద్ద సంఖ్యలో పోలీస్ బలగాల్ని మేక్రాన్ ప్రభుత్వం రంగంలోకి దింపింది. ఒక్క పారిస్ నగరంలోకి 11వేల మంది నిరసనకారులు ప్రవేశిస్తున్నారని వార్తలు వెలువడుతున్నాయి. పారిస్లోని ఆర్థిక మంత్రిత్వశాఖ భవనం ముందు నుంచి మొదలైన నిరసన ర్యాలీలో వేలాదిమంది పాల్గొన్నారు. పెన్షనర్లపై, కార్మికులపై పన్నుల భారం తగ్గించాలనీ, అత్యంత ధనవంతులపై పన్నులు పెంచాలనీ వారంతా డిమాండ్ చేశారు.