Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మలేషియా రాజధాని కౌలాలంపూర్లో ఘటన
కౌలాలంపూర్ : ఇన్స్టాగ్రామ్ పోల్ ఓ మైనర్ బాలిక ప్రాణాలు తీసింది. ఆమె ఫాలోవర్లు చేసిన సూచనలతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఈనెల13న సరవాక్ ప్రాంతానికి చెందిన ఓ పదహారేండ్ల బాలిక ఇన్స్టాగ్రామ్లో ఓ పోల్ నిర్వహించింది. దీనిలో 'ఇది నాకు చాలా ముఖ్యం. చావో, బతుకో తేల్చుకోవడంలో నాకు సాయం చేయండి' అంటూ తన ఫాలోవర్లను కోరింది. ఏదో సరదాకు అనుకున్న నెటిజన్లు.. దాదాపు 69 శాతం మంది ఆమెను చనిపోమ్మని సూచించారు. దీంతో, ఆ బాలిక ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్టు ఎస్పీ ఐదిల్ బొల్హసన్ తెలిపారు.
ఈ విషయంపై ఎంపీ రామ్కర్పాల్ సింగ్ స్పందించారు. 'పోల్లో పాల్గొని చనిపోమని సూచించిన వారందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఆమెకు చనిపోమ్మని సలహా ఇచ్చింది వారే. తమ సమాధానం వల్ల ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయో వారు ఊహించలేకపోయారు. యువతి అనాలోచిత చర్యకు వీరంతా మద్దతు తెలిపారు. ఇలాంటి సంఘటనలు జరగడం నిజంగా దురదృష్టం. ఒకవేళ మైనర్బాలిక ఫాలోవర్స్ అంతా ఆమెను చనిపోవద్దని సలహా ఇచ్చి ఉంటే బాగుండేది' అని అన్నారు. ఇదిలా ఉండగా, మలేషియా చట్టాల ప్రకారం ఆత్మహత్యకు ప్రేరేపించడం తీవ్ర నేరంగా పరిగణిస్తారు. ఇలాంటి చర్యలకు పాల్పడినవారు దోషులుగా తేలినట్టయితే న్యాయస్థానం మరణదండన లేదా 20ఏండ్ల జైలుశిక్ష విధిస్తుంది.