Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శాన్ఫ్రాన్సిస్కో: ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్ వినియోగంపై నిబంధనలను కఠినతరం చేసింది. విద్వేషాలను రెచ్చగొట్టే ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతుగా నిలిచే దృశ్యాల ప్రసారాలను అరికట్టేందుకు పలు ఆంక్షలు విధించింది. న్యూజిల్యాండ్లోని క్రైస్ట్చర్చ్ మసీదుల్లో జరిగిన మారణహోమం నేపథ్యంలో లైవ్ స్ట్రీమింగ్ విధానాలపై సంస్థ చర్యలు చేపట్టింది. 'న్యూజిలాండ్ ఘటనతో మా విధివిధానాలను పున్ణపరిశీలించాం. విద్వేష ప్రసారాలను అరికట్టేందుకు కృషి చేస్తాం. విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉండే దృశ్యాలను ఒక్కసారి ప్రసారం చేసినా అలాంటి వారిపై భవిష్యత్లో లైవ్ స్ట్రీమింగ్ వినియోగించకుండా నిషేధం విధిస్తాం. ఉగ్ర సందేశాలను షేర్ చేసిన వారిపై కూడా చర్యలు తీసుకుంటాం' అని ఫేస్బుక్ వైస్ ప్రెసిడెంట్ గారు రోజెన్ వెల్లడించారు. ఈ నిబంధనలతో భవిష్యత్లో న్యూజిలాండ్ తరహా ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని రోజెన్ ఆశాభావం వ్యక్తం చేశారు. న్యూజిలాండ్లోని క్రైస్ట్చర్చ్లో మార్చి15న బ్రెంటన్ టారెంట్ అనే మతోన్మాది నరమేధానికి పాల్పడిన విషయం తెలిసిందే. మసీదుల్లోకి చొరబడి విచక్షణా రహితంగా కాల్పులు జరిపి 51 మందిని పొట్టనబెట్టుకున్నాడు. కాగా, టారెంట్ ఈ దురాగతాన్ని ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ప్రసారం చేశాడు. దీంతో ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఫేస్బుక్ నిబంధనలు కఠినతరం చేసింది.
ఇమేజ్, వీడియో అనాలిస్ టెక్నాలజీ కోసం 7.5 మిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నట్టు ఫేస్బుక్ ప్రకటించింది. ఈమేరకు అమెరికాలోని మూడు ప్రముఖ వర్సిటీ పరిశోధకుల సహకారం తీసుకోనున్నట్టు తెలిపింది. ఫేస్బుక్ తీసుకుంటున్న చర్యలను స్వాగతిస్తున్నట్టు న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెన్ తెలిపారు.