Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించిన ట్రంప్
- అమెరికా కంపెనీలు విదేశీ సేవలు పొందకుండా ఆంక్షలు
వాషింగ్టన్: అమెరికా కంప్యూటర్ నెట్వర్క్కు విదేశీ సంస్థల నుంచి ముప్పు పొంచివుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఈనేపథ్యంలో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అయితే, ఏ విదేశీ కంపెనీల నుంచి కంప్యూటర్ నెట్వర్క్కు ముప్పు పొంచివుందన్న విషయాన్ని మాత్రం ఆయన నేరుగా ప్రస్తావించలేదు. చైనాకు చెందిన అతిపెద్ద టెలికమ్యూనికేషన్ దిగ్గజం హువావే కంపెనీని ట్రంప్ టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. అత్యవసర పరిస్థితులు అమల్లోకి రావడంతో అమెరికా కంపెనీలు విదేశీ టెలికాం సేవలను వినియోగిం చడానికి బ్రేక్ పడింది. గతకొంతకాలంగా హువావే కంపెనీపై ట్రంప్ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సంస్థ గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడుతోందంటూ చైనా కంపెనీపై బురద జల్లేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం తారాస్థాయికి చేరుకోవడంతో పరస్పర విమర్శల పర్వం కొనసాగుతోంది. హువాయే నెట్వర్క్ను తమ మిత్రదేశాలెవరూ వాడొద్దంటూ ఒత్తిడి పెంచేందుకు ట్రంప్ ప్రయత్నిస్తూనే ఉన్నారు. తాజాగా, అత్యవసర పరిస్థితిని ప్రకటించడంతోపాటు హువావేపై అమెరికా ఆంక్షలు కూడా విధించింది. ప్రభుత్వ అనుమతి లేకుండా హువావే అమెరికా సంస్థల నుంచి ఎటువంటి పరికరాలు కొనుగోలు చేయకూడదని స్పష్టం చేసింది. దీనిపై హువావే స్పందిస్తూ తాము వ్యాపారం చేయకుండా అడ్డుకుంటే అమెరికా వినియోగదారులు, కంపెనీలే ఇబ్బంది పడతాయని స్పష్టంచేసింది. అమెరికా ఆంక్షలు అర్థంలేనివని, తాము ఏ దేశం కోసం పనిచేయడం లేదని స్పష్టం చేసింది. తమతో వ్యాపారాన్ని వదులుకుని ఖరీదైన ప్రత్యామ్నాయం వైపు ఆ దేశం అడుగు వేస్తోందని ఆరోపించారు. ఈ నిర్ణయాలతో అమెరికా, చైనా మధ్య సంబంధాలు మరింత దెబ్బతినే ప్రమాదం ఉంది.