Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్తంభించిన జనజీవనం, ఆరుగురి మృతి
అసన్షియన్ : పరాగ్వేలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. ప్రెసిడెంటీ హయేస్, ఆల్టో పరాగ్వే నగరాల్లో వరదల్లో చిక్కుకొని ఆరుగురు మృతిచెందగా, మరికొందరు గల్లంతయ్యారు. ప్రత్యేక బృందాలు గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలిస్తున్నాయి. వరద నీరు రోడ్లపై భారీగా వచ్చి చేరింది. విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలిపోయాయి. దీంతో, అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పలు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ విధించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. విద్యాసంస్థలు, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. పరాగ్వే నది పొంగిపొర్లుతున్నది. పిలార్ ప్రాంతంలో వందలాది ఇండ్లు వరద ప్రవాహంలో కొట్టుకొనిపోయాయి. మరికొద్ది రోజుల పాటు వరద ఉధృతి కొనసాగే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.