Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికావి కవ్వింపు చర్యలు : ఇరాన్ విదేశాంగ మంత్రి
టెహ్రాన్ : అమెరికాతో యుద్ధం కోరుకోవడంలేదని, ఒకవేళ అగ్రరాజ్యం యుద్ధానికి దిగినట్టయితే ఎదుర్కొనే సత్తా తమలో ఉందని ఇరాన్ విదేశాంగ మంత్రి జవాద్ జరీఫ్ స్పష్టం చేశారు. ఇరాన్, అమెరికా దేశాల మధ్య కొంతకాలంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇరాన్పై అమెరికా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. గల్ఫ్ సముద్ర జలాల్లో యుద్ధ నౌకలు మోహరించి యుద్ధ వాతావరణం సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. ఓపక్క ఇరాన్తో తాము యుద్ధం కోరుకోవడంలేదని బుకాయిస్తూనే ఇరాక్ దౌత్యకార్యాలయ సిబ్బందిని వెనక్కి వచ్చేయాలని ట్రంప్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇరాన్ను ఆర్థికంగా దెబ్బతీయాలనే దురుద్దేశంతో భారీ ఆంక్షలు మోపింది. ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకునే దేశాలపై భారీ ఆంక్షలు మోపుతామని హెచ్చరిస్తూనే ఉంది. ఇరాన్ని ఒంటరి చేయాలని అమెరికా కుట్ర పన్నింది. ఈ కుట్రలో భాగంగా అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియోని మధ్య ప్రాఛ్య దేశాల్లో పర్యటిస్తున్నారు. ఇరాన్ అణ్వస్త్ర ఒప్పందం, ఇరాన్ని ఒంటరి చేయడం లాంటి అంశాలను అన్ని దేశాలతో చర్చించేందుకు అగ్రరాజ్యం ప్రయత్నిస్తోంది. ఇరాన్ మిత్రదేశాల నేతలతోనూ పాంపియో భేటీకి సిద్ధమయ్యారు. అయితే, అమెరికా చర్యలను మాత్రం ఇరాన్ ఏమాత్రం లెక్క చేయడంలేదు. ప్రత్యామాయ మార్గాలపై దృష్టి పెట్టింది. అమెరికా చర్యలను లెక్కచేయని ఈయూ...ఇరాన్తో ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగిస్తున్నది. మరికొన్ని దేశాలు కూడా ఇరాన్తో యుద్ధం అవసరంలేదనే అభిప్రాయానికి వచ్చాయి. గతవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన నాలుగు చమురు ట్యాంకర్లు సముద్ర జలాల్లో ప్రమాదానికి గురయ్యాయి. ఇరాన్ ఓడల్లో క్షిపణులు నిల్వ ఉండటంతోనే సౌదీ నౌకలకు నష్టం వాటిల్లిందని అసత్య కథనాలతో ఊదరగొట్టేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. ఇరాన్పై పరోక్షంగా సౌదీని ఉసిగొల్పేందుకు కుట్ర పన్నింది. గల్ఫ్ సముద్ర జలాల్లో యుద్ధ నౌకలను మోహరించాలని, యుద్ధ విమానాలతో చక్కర్లు కొట్టాలని ఇప్పటికే సౌదీ మిత్రదేశాలు అమెరికాను కోరాయి.