Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆయిల్ నిక్షేపాల కోసం రూ.700కోట్లు వృథా
కరాచీ: అరేబియా మహాసముద్రంలోని కరాచీ తీరప్రాంతంలో చమురు నిల్వలున్నాయని ఆశపడ్డ పాకిస్థాన్కు ఆశాభంగమైంది. అరేబియన్ ఆఫ్షోర్లో కొన్నినెలలుగా పాకిస్థాన్ పెట్రోలియం లిమిటెడ్ పరిశోధనలు జరపగా ఆయిల్ నిక్షేపాలకు సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లూ లభించకపోవడంతో ఆ సంస్థ డ్రిల్లింగ్ పనులను నిలిపివేసింది. అయితే ఆయిల్ వెలికితీతకు సంబంధించిన పరిశోధనలు మాత్రం కొనసాగుతాయని సాంకేతిక బందం ప్రకటించింది. కరాచీ తీరంలో ఆయిల్ నిక్షేపాలు భారీగా బయటపడే అవకాశం ఉందని..దీంతో పాకిస్థాన్ కష్టాలు తీరిపోతాయంటూ ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ఖాన్ ప్రకటించడంతో ఈ అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. డ్రిల్లింగ్ జరిపిన కెక్రా-1 ప్రాంతంలో ఆయిల్ నిక్షేపాలపై పాకిస్థాన్ పెట్రోలియం లిమిటెడ్ భారీగా ఆశలు పెట్టుకుంది. దాదాపు 5500 మీటర్ల మేర ఆఫ్ షోర్ డ్రిల్లింగ్ పనులు నిర్వహించింది. అయితే ఎలాంటి ఆయిల్ ఆనవాళ్లు బయటపడకపోవడంతో డ్రిల్లింగ్ పనులు నిలిపివేస్తున్నట్టు సంస్థ సీనియర్ అధికారి తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం పాక్ ఇప్పటికే రూ.700 కోట్లు ఖర్చు పెట్టింది. అయితే భవిష్యత్తులో జరిపే ఇతర పరిశోధనలకు ఈ అనుభవం ఉపయోగపడుతుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. కాగా, ప్రాజెక్టులో పాకిస్థాన్ పెట్రోలియం లిమిటెడ్తో పాటు అమెరికాకు చెందిన ఎక్సాన్ మొబిల్, ఇటాలియన్ ఆయిల్ సంస్థలు కూడా భాగస్వాములుగా ఉన్నాయి. దీనిపై పాక్ పెట్రోలియం లిమిటెడ్ కంపెనీ అధికార ప్రతినిధి అహ్మద్ లాక్ మాట్లాడుతూ..పాక్ తన ప్రయత్నాలను కొనసాగించాలన్నారు. కెక్రా-1 ప్రాంతంలో భారీ మొత్తంలో హైడ్రోకార్బన్ నిల్వలున్నట్టు నిపుణులు చెబుతున్నారని తెలిపారు.