Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హువావేపై 90రోజులకు
- ఆంక్షలు సడలించిన అమెరికా
బీజింగ్: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ హువావే అమెరికాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా, చైనా దేశాలకు మధ్య వాణిజ్య పోరు కొనసాగుతున్న నేపథ్యంలో హార్డ్వేర్, ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్, టెక్నాలజీ సేవలను హువావేకు బదిలీ చేయడం నిలిపేస్తున్నట్టు అమెరికా దిగ్గజ ఇంటర్నెట్ సంస్థ గూగుల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై హువావే వ్యవస్థాపకుడు రెన్ జెంగ్ఫీ ఘాటుగా స్పందించారు. తమ బలాన్ని అమెరికా తక్కువ అంచనా వేస్తోందంటూ హెచ్చరించారు. సోమవారం చైనా మీడియా సంస్థతో ఆయన మాట్లాడారు. 'మా బలాన్ని తక్కువగా అంచనా వేసి అమెరికా రాజకీయ నాయకులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు' అని జెంగ్ఫీ అన్నారు.
హువావే వ్యాపారం చేయడానికి వీల్లేకుండా విధించిన నిషేధాన్ని 90రోజులు సడలించినట్టు ట్రంప్ సర్కారు ప్రకటించింది. ఈ మేరకు అమెరికా వాణిజ్య మంత్రి విల్బర్ రాస్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నిర్ణయంతో హువావేకు కాస్త ఊరట లభించింది. అయితే, హువావేతో జాతీయ భద్రతకు ముప్పు ఉందని, ట్రంప్ విధించిన నిషేధంలో ఎలాంటి మార్పు ఉండదని రాస్ స్పష్టం చేశారు. అమెరికా సంస్థలతో వాణిజ్యం కొనసాగించేందుకు హువావేకు తాత్కాలిక లైసెన్స్ మాత్రమే ఇచ్చినట్టు తెలిపారు. అమెరికాలోని టెలికాం ఆపరేటర్లు కీలక సేవల కోసం హువావే పరికరాలు వినియోగిస్తున్నందు వల్ల ఆయా కంపెనీల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కల్పించేందుకే నిషేధాన్ని ఈఏడాది ఆగస్టు 19 వరకు సడలించినట్టు తెలిపారు. తాత్కాలిక లైసెన్స్ ఇవ్వడం వల్ల హువావే మొబైల్ఫోన్ల వినియోగదారులకు సేవలు కొనసాగడమే కాకుండా గ్రామీణ బ్రాండ్ నెట్వర్క్ తమ సేవలు అందించేందుకు అవకాశం ఏర్పడుతుందని రాస్ తెలిపారు.
5జీ నెట్వర్క్పై ఎలాంటి ప్రభావం ఉండదు
అమెరికా చర్యల వల్ల హువావే 5జీ నెట్వర్క్పై ఎలాంటి ప్రభావం ఉండదని రెన్ జెంగ్ఫీ అన్నారు. హువేవా స్థాయి టెక్నాలజీని అందుకోవాలంటే ఇతర సంస్థలకు కనీసం రెండు లేదా మూడేండ్ల సమయం పడుతుందన్నారు. హువావేపై అమెరికా విధించిన నిషేధాన్ని 90 రోజులు సడలించినా ఆ ప్రభావం తమ సంస్థపై ఉండదన్నారు. తాము అన్నింటికీ సిద్ధంగా ఉన్నామని అన్నారు. అమెరికా తయారు చేస్తున్న చిప్సెట్లను హువాయే తయారు చేయగలదని అన్నారు. ఇతర సంస్థలతో పోల్చి చూసినట్టయితే 5జీ నెట్వర్క్ను అభివృద్ధి చేసిన ఘనత తమ సంస్థదేనని జెంగ్ఫీ తెలిపారు.
హార్డ్వేర్, సాఫ్ట్వేర్లతో సహా ఇతర ఏ సాంకేతిక సహకారం హువావేకు అందించబోమని గూగుల్ సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనివల్ల ఇప్పటికే హువావే మొబైల్స్ వినియోగిస్తున్న వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్లకు సంబంధించి కొత్త అప్డేట్స్ను కూడా గూగుల్.. హువావే వినియోగదారులు యథావిధిగా అందిస్తుంది. దీనిపై ఇప్పటికే గూగుల్ స్పష్టతనిచ్చింది.
' హువావేపై అమెరికా విధించిన నిషేధం సడలించినా, భవిష్యత్లో ఆ కంపెనీ తయారు చేసే స్మార్ట్ఫోన్ వ్యాపారంపై తీవ్ర ప్రభావం కనబరిచే అవకాశముంది. స్మార్ట్ఫోన్లలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ను హువావే వినియోగించుకోలేదు. దీని కారణంగా చైనా వెలుపల విక్రయాలు జరపాలంటే ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే గూగుల్ అందించే సేవలైన గూగుల్ ప్లేస్టోర్, జీమెయిల్, యూట్యూబ్ వంటి అప్లికేషన్లు హువేవా ఫోన్లలో ఉండవు. హువావే కేవలం ఆండ్రాయిడ్కు సంబంధించిన పబ్లిక్ వెర్షన్ను మాత్రమే వినియోగించుకోగలదు. అత్యంత ప్రాముఖ్యత కలిగిన యాప్స్ను, సేవలను గూగుల్ నుంచి పొందలేదు' అని టెక్ వర్గాలు చెబుతున్నాయి. మరి ట్రంప్ సర్కారు తీసుకుంటున్న కఠిన నిర్ణయాల నేపథ్యంలో ఈ వాణిజ్య యుద్ధం ఎటు వైపునకు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే.
హువావే మొబైల్స్లో అమర్చుతున్న చిప్లు అమెరికా, చైనా దేశాల నుంచి సరఫరా అవుతున్నాయి. హువావేని ఏకాకిని చేయాలనే అమెరికా ప్రయత్నాలు కచ్చితంగా విఫలమవుతాయని ఆ సంస్థ పేర్కొంది. హువావే సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుకోవాలంటే అమెరికాకు మూడేండ్ల సమయం కచ్చితంగా పడుతుందని తెలిపింది.