Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : శరణార్థుల చిన్నారుల పట్ల అమెరికా అవలంభిస్తున్న విధానాలు ఓ చిన్నారి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. అమెరికా సరిహద్దులోని శరణార్థుల నిర్బంధ కేంద్రంలో గురువారం మృతిచెందిన చిన్నారితో కలిపి ఆరుగురు చిన్నారులు మృతిచెందారు. ఇతర దేశాల నుంచి ఆశ్రయం కోసం వస్తున్న శరణార్థుల పట్ల యూఎస్ సరిహద్దు ప్రత్యేక భద్రతాదళాలు అమానవీయంగా ప్రవర్తిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధ్రువీకరణ పత్రాల తనిఖీ పేరుతో శరణార్థులను వేధిస్తున్నాయి. సరైన ధ్రువీకరణ పత్రాలు ఉన్న వారిని సరిహద్దు నుంచే వెనక్కి తిప్పి పంపుతున్నాయి. ఎలాంటి పత్రాలు లేని వారిని అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురిచేస్తున్నాయి. శరణార్థుల పిల్లలను, తల్లిదండ్రుల నుంచి వేరు చేసి ప్రత్యేక గదుల్లో బంధిస్తున్నాయి. ట్రంప్ సర్కారు తీరుపై కుమార్తె ఇవాంక ట్రంప్ కూడా మండిపడ్డారు. చిన్నారులను తల్లిదండ్రుల నుంచి దూరం చేయొద్దని అమెరికా అధ్యక్షుడిని కోరారు. అయితే, సరిహద్దు భద్రతదళాల తీరు మాత్రం మారలేదు. అక్రమ నిర్బంధంలో ఉంటున్న చిన్నారులు మానసికంగా కుంగిపోతున్నారు. తల్లిదండ్రుల నుంచి దూరం కావడంతో ఇబ్బందిపడుతున్నారు. వ్యాధుల బారినపడి అకాలమరణం చెందుతున్నారు. తాజాగా, గ్వాటెమలాకు చెందిన కార్లోస్ హెర్నాండెజ్ అనే చిన్నారి మృతిచెందాడు. చిన్నారులను నిర్బంధించిన గదులు ఇరుకుగా ఉండటమే కాకుండా, గాలి ఆడకపోవడంతో చిన్నారులు ఉక్కిరిబిక్కిరై మృతిచెందుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.