Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ట్రిపోలీ: ట్రిపోలీ తీరంలో నీట మునుగుతున్న రెండు పడవల నుండి 300 మంది వలసవాసులను లిబియా నౌకాదళం శనివారం రక్షించినట్లు అధికారులు తెలిపారు. లిబియా రాజధాని ట్రిపోలీ తీరానికి 50 కి.మీ తూర్పు దిక్కులో మునిగిపోతున్న ఒక పడవ నుండి కోస్ట్గార్డ్ నౌక సిబ్బంది ఆఫ్రికాలోని వివిధ దేశాలకు చెందిన 87 మంది వలసదారులను రక్షించినట్లు నౌకాదళ ప్రతినిధి అయూబ్ కాసిమ్ చెప్పారు. వారిని ట్రిపోలి లోని నౌకా స్థావరానికి తరలించామన్నారు.
మరో ఘటనలో ట్రిపోలీకి 140 కి.మీ దూరంలోని జ్లిటెన్ పట్టణం సమీపంలో రెండు బోట్లు మునిగిపోతుండగా, వాటి నుండి 203 మందిని రక్షించి సక్ అల్ ఖామిస్ నిర్బంధ శిబిరానికి తరలించినట్లు నౌకాదళం తన ప్రకటనలో వివరించింది. అయితే వలసవాసులను లిబియాలోని శిబిరాలకు తరలించటంపై ఐరాస, సహాయక సంస్థలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశాయి.