Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికా విదేశాంగ మంత్రి పాంపియో వెల్లడి
- మా ఆయుధాలతో మీ నౌకలను ముంచేస్తాం:ఇరాన్ హెచ్చరిక
వాషింగ్టన్/టెహ్రాన్: మధ్యప్రాచ్యంలో ఇరాన్ దూకుడును అడ్డుకునేందుకు అరబ్ దేశాలకు 800 కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలను విక్రయించనున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో వెల్లడించారు. ఆయుధ ఎగుమతుల నియంత్రణా చట్టం పరిధిలో 810 కోట్ల డాలర్ల విలువైన ఆయుధసామగ్రి, బాంబులు, క్షిపణులతోపాటు సైనికదళాలను సౌదీ అరేబియా, జోర్డాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లకు పంపుతున్నట్లు ఆయన శనివారం ఇక్కడ తెలిపారు. గల్ఫ్, మధ్యప్రాచ్యంలో ఇరాన్ దుస్సాహసాన్ని అడ్డుకునేందుకు సాధ్యమైనంత త్వరలో ఈ ఆయుధాలను, సైనిక దళాలను అక్కడికి తరలిస్తామని చెప్పారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించిన డెమొక్రాటిక్ ప్రతినిధి క్రిస్ మర్ఫీ 'ఈ ప్రతిపాదనను అమెరికన్ కాంగ్రెస్ తిరస్కరిస్తుందని తెలిసే అధ్యక్షుడు దొడ్డిదోవను ఎంచుకున్నారని, ఈ బాంబులను వారికి విక్రయించాల్సినంత అత్యవసర స్థితి ఏమీ లేదని అన్నారు.
మీ నౌకలను ముంచేస్తాం ఖబడ్దార్...: ఇరాన్ హెచ్చరిక
మధ్యప్రాచ్యంలోకి వస్తున్న అమెరికా యుద్ధనౌకలపై ప్రయోగించేందుకు తాము అత్యాధునిక ఆయుధాలను సిద్ధం చేస్తున్నామని ఇరాన్సైనికాధికారి జనరల్ మోర్తజా కుర్బానీ చెప్పారు. 'మూర్ఖంగా వ్యవహరిస్తే తాము అమెరికా యుద్ధ నౌకలు, విమానాలను సిబ్బందితోసహా సముద్రంలో ముంచేస్తామని ఆయన హెచ్చరించారు. ఇందుకు తమకు రెండు క్షిపణులు లేదా రెండు రహస్య ఆయుధాలు సరిపోతాయని ఆయన అన్నారు. అయితే రహస్య ఆయుధాలు ఏమిటన్నది ఆయన వెల్లడించలేదు.