Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హవానా: ఇటీవల ప్రారంభించిన అమెరికా రాయబార కార్యాలయంలో అమెరికా జాతీయ పతాకావిష్కరణతో క్యూబా-అమెరికా మధ్య దౌత్య సంబంధాలు లాంఛనంగా పునఃప్రారంభమయ్యాయి. ఇరుదేశాలు అటు వాషింగ్టన్, ఇటు హవానాలలో తమ దౌత్య కార్యాలయాలను గత నెల 20న పునఃప్రారంభించిన విషయం తెలిసిందే. శనివారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో అమెరికా విదేశాంగ మంత్రి జాన్కెర్రీ తమ రాయబార కార్యాలయంపై అమెరికా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 1945లో ఇరుదేశాల మధ్యసంబంధాలు విచ్ఛిన్నమైన తరువాత అమెరికా విదేశాంగ మంత్రి క్యూబాను సందర్శించటం ఇదే తొలిసారి కావటం విశేషం. పతాకావిష్కరణ అనంతరం జరిగిన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కెర్రీ మాట్లాడుతూ ఇరుదేశాల అధ్యక్షులు చరిత్ర చెర నుండి బయటకు వచ్చి తమ ముందుకు వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ధైర్యంగా నిర్ణయం తీసుకున్నారని అభివర్ణించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న క్యూబా విదేశాంగ మంత్రి బ్రూనో రోడ్రిగ్జ్ మాట్లాడుతూ ఇరుదేశాల మధ్య గత అర్ధశతాబ్దానికి పైగా అపరిష్కృతంగా వున్న సమస్యలను పరిశీలించి పరిష్కరించేందుకు ద్వైపాక్షిక కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. మరికొద్ది వారాల్లో ఈ కమిషన్ తొలిభేటీ జరుగుతుందన్నారు.