Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సైన్యం అంగీకారం
ఇస్లామాబాద్: దేశం ప్రస్తుతం ఆర్థిక క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో తమ బడ్జెట్లో కోత విధించుకునేందుకు పాక్ సైన్యం నిర్ణయించుకుంది. పాక్ సైన్యానికి చెందిన ఇంటర్సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్పిఆర్) విభాగం డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ మంగళవారం తన ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించారు. సైన్యం స్వచ్ఛందంగా తన రక్షణ బడ్జెట్ను తగ్గించుకున్నంత మాత్రాన దేశ రక్షణ, భద్రతలో రాజీ పడబోమని ఆయన స్పష్టం చేశారు. ఎటువంటి ప్రమాదాలనైనా దీటుగా ఎదుర్కొనేందుకు సైన్యం సర్వసన్నద్ధంగా ఉంటుందన్నారు. అంతర్గత చర్యల ద్వారా ఈ కోతల ప్రభావాన్ని తగ్గించుకునేందుకు త్రివిధ దళాలూ ప్రయత్నిస్తాయని, ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాలు, బెలూచిస్తాన్ అభివృద్ధిలో పాల్గొనటం తమకు ముఖ్యమని ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు. అయితే ఎంత మేర బడ్జెట్ కోతలు ఉంటాయన్నది ఆయన ప్రస్తావించలేదు. సైనిక బడ్జెట్ను తగ్గించుకోవాలన్న పాక్ సైన్యం నిర్ణయాన్ని ప్రధాని ఇమ్రాన్ఖాన్ ప్రశంసలతో ముంచెత్తారు. సైన్యం నిర్ణయం అత్యంత అభినందనీయమైనదని ఆయన ఒక ట్వీట్లో పేర్కొన్నారు. పాకిస్తాన్ భద్రతా పరంగా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ తన బడ్జెట్ను తగ్గించుకోవాలని నిర్ణయించుకున్న సైన్యానికి తాను కృతజ్ఞుడనై ఉంటనన్నారు. ఈ కోతల ద్వారా సమకూరిన నిధులను ఆదివాసీ ప్రాంతాలు, బెలూచిస్తాన్ అభివృద్ధికి వినియోగిస్తామని ఆయన తెలిపారు.