Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోపెన్హాగెన్: డెన్మార్క్ పార్లమెంట్కు జరిగిన ఎన్నికల్లో సోషల్ డెమొక్రాట్స్ విజయపథంలో దూసుకెళ్తున్నట్టు ప్రాథమిక ఫలితాల ద్వారా తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో పాప్యులిస్ట్ పార్టీకి ఎదురుదెబ్బ తగలగా, వామపక్ష పార్టీలు అనేక చోట్ల మెజార్టీ దిశగా అడుగులు వేస్తున్నాయి. ప్రాథమిక ఫలితాలే తుది ఫలితాలుగా నిర్ధారణ అయితే సోషల్ డెమొక్రాట్స్ నాలుగేండ్ల విరామం తరువాత మరోసారి అధికారం చేపట్టటం ఖాయమని పరిశీలకులు పేర్కొంటున్నారు..
దేశంలోకి వలసలను అనుమతించే విషయంలో కఠిన వైఖరిని అవలంబించిన సోషల్ డెమొక్రాటిక్ పార్టీ నేతలకు ఎన్నికల్లో 25.9 శాతం ఓట్లు లభించినట్టు ప్రాథమిక ఫలితాల ద్వారా తెలుస్తోంది. తాము ఇతర పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయటం కన్నా మైనార్టీ ప్రభుత్వ నిర్వహణకే మొగ్గు చూపుతామని సోషల్ డెమొక్రాటిక్ పార్టీ నేత మెట్ ఫ్రెడరిక్సన్ చెప్పారు. వలసల వంటి అంశాలపై రైట్ పార్టీల నుండి, సామాజిక సంక్షేమం వంటి అంశాలలో లెఫ్ట్ పార్టీల నుండి తాము మద్దతు కోరుతామని ఆమె చెప్పారు. సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు తాము మొగ్గుచూపబోమని ఫ్రెడరిక్సన్ చెబుతున్నప్పటికీ ఓట్ల శాతం పెంచుకున్న వామపక్ష పార్టీలు సెంటర్ రైట్ పార్టీలకు అవకాశం ఇవ్వకుండా సోషల్ డెమొక్రాట్ ప్రభుత్వానికి మద్దతునిచ్చే అవకాశం వుందని పరిశీలకులు చెబుతున్నారు. మొత్తం 179 స్థానాలున్న పార్లమెంట్లో సోషల్ డెమొక్రాట్స్, వామపక్ష పార్టీలకు మెజార్టీ సంఖ్య కన్నా ఎక్కువ స్థానాలు దక్కే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సమయానికి లిబరల్ పార్టీకి చెందిన ప్రధాని లార్స్ లోక్ రాస్ముస్సన్ గత ఎన్నికల కన్నా స్వల్ప ఆధిక్యత ప్రదర్శించారు. అయితే పాపులిస్ట్ డేనిష్ పీపుల్స్ పార్టీ మాత్రం భారీగా నష్టపోయింది.
ఇతర ఐరోపా దేశాలలో పాపులిస్ట్ పార్టీలు మెరుగైన పనితీరు చూపుతున్నప్పటికీ డేనిష్ పీపుల్స్ పార్టీ అందుకు విరుద్ధంగా పార్లమెంట్లో మెజార్టీ కోల్పోవటం విశేషం. ఈ పార్టీకి 2015 నాటి ఎన్నికల్లో 21.1 శాతం ఓట్లు లభించగా ఇప్పుడు కేవలం 9 శాతానికి మాత్రమే పరిమితమయ్యాయి. ఓటమిని అంగీకరించిన ప్రధాని లోక్రాస్ముసన్ గురువారం తన పదవికి రాజీనామాచేశారు.