Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రియాద్: ఇటీవల సౌదీ సముద్ర తీరంలో నిలచి ఉన్న ఎమిరేట్స్ చమురు టాంకర్లపై జరిగిన దాడిలో 'ప్రభుత్వ శక్తుల' హస్తం ఉందని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడయినట్టు తెలుస్తోంది. ఈ నాలుగు టాంకర్లపై దాడిలో ఇరాన్ ప్రమేయం ఉందంటూ అమెరికా ఆరోపణలు గుప్పిస్తున్న నేపథ్యంలో వెలుగు చూసిన ఈ నివేదికలో ఇరాన్ ప్రస్తావన లేకపోవటం విశేషం. ఎమిరేట్స్, సౌదీ అరేబియా, నార్వే దేశాలు సంయుక్తంగా జరిపిన విచారణలో 'ప్రభుత్వ శక్తుల' హస్తం ఉందని తేలిందని, ఈ దర్యాప్తు నివేదికను గురువారం నాడు ఐరాసకు అందచేశారని మీడియా సంస్థలు వెల్లడించాయి.
దాడి చేసిన వారు చమురు వాహక నౌకలకు నష్టం కలిగించారు తప్ప ఎవరినీ గాయపర్చటం లేదా చమురును సముద్రంలోకి లీక్ చేయటం వంటి చర్యలకు పాల్పడలేదని పేర్కొన్నాయి. 'అత్యంత చాకచక్యంగా' జరిగిన ఈ దాడిలో నౌకాయానం నిపుణులు స్పీడ్ బోట్లను వినియోగించారని ఈ నివేదికలో పేర్కొన్నారు.
అయితే ఈ దాడిలో 'ప్రభుత్వ శక్తుల' ప్రమేయం ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోందని వివరించారు. ఈ నివేదికను రూపొందించిన మూడు దేశాలలో రెండు అమెరికా ప్రధాన మిత్రదేశాలు, మధ్యప్రాచ్యంలో అమెరికన్ ఆయుధాలను కొనుగోలు చేసే క్లయింట్ దేశాలు కావటం గమనార్హం. ఈ నేపథ్యంలో అత్యంత జాగ్రత్తగా రూపొందించిన ఈ నివేదికలో ఇరాన్ పేరును ప్రస్తావించకపోవటం గమనార్హం.