Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాని రేసులో బోరిస్ జాన్సన్
లండన్: బ్రెగ్జిట్పై ఏకాభిప్రాయం సాధించడంలో విఫలం కావడంతో బ్రిటన్ ప్రధానమంత్రిగా థెరిస్సా మే శుక్రవారం రాజీనామా చేశారు. అదేవిధంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వం నుంచి వైదొలిగినట్టు ప్రకటించారు. కొత్త ప్రధానమంత్రిగా మరొకరు నియమితులయ్యే వరకు ఆమెనే ప్రధానిగా కొనసాగనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని పదవి రేసులో బ్రిటన్ మాజీ విదేశాంగ మంత్రి బోరీస్ జాన్సన్ సహా పలువురు కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు పోటీ పడుతున్నారు.
యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడమే బ్రెగ్జిట్. ఈ కూటమిలో ఉండటం వల్ల ఇతర దేశాల కన్న చాలా వెనుకబడుతున్నామని బ్రిటన్ భావిస్తున్నది. అదేవిధంగా వ్యాపార నిబంధనల పేరుతో అనేక పరిమితులను విధిస్తున్నారనీ, యూనియన్లో సభ్యత్వం రుసుం కింద అధిక మొత్తాన్ని వసూలు చేస్తున్నారని బ్రిటన్ ఈ కూటమి నుంచి వైదొలడానికి ప్రయత్నిస్తున్నది. ఈ నేపథ్యంలో భాగంగానే 2016,జూన్లో బ్రెగ్జిట్ పై ప్రజాభిప్రాయ సేకరణ చేయగా.. దీనికి అనుకూలంగా ప్రజా ఆమోదం లభించింది. దీంతో బ్రెగ్జిట్ బిల్లును థెరిస్సామే 2019 మార్చిలో బ్రిటన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. కానీ ఈ బిల్లు 230 ఓట్ల తేడాతో తిరస్కరించబడింది. దీంతో థెరిస్సా మే ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అదేవిధంగా బ్రెగ్జిట్ పై గడువు అక్టోబర్ 31 తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్తగా ప్రధానిగా పగ్గాలు చేపట్టే వ్యక్తికి దీనిపై ఏకాభిప్రాయం సాధించి.. తుది రూపం ఇచ్చేందుకు స్వల్ప వ్యవధి మాత్రమే ఉంది.