Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 2024 కల్లా మరోసారి చంద్రునిపై కాలుమోపాలన్న నాసా లక్ష్యాన్ని ఆయన తప్పుబట్టారు. యాభై ఏండ్ల కిందటే సాధించిన దాన్ని మరోసారి ఎందుకు లక్ష్యంగా పెట్టుకున్నారని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ట్విటర్ వేదికగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
'నాసా ఇంకా చంద్రునిపైకి వెళ్లడం గురించి మాట్లాడొద్దు. దీన్ని మనం 50 ఏండ్ల కిందటే సాధించాం. మనం చేస్తున్న భారీ ఖర్చుకు అంగారక గ్రహంపైకి చేరుకోవడం, రక్షణ, శాస్త్ర సాంకేతికాభివృద్ధి లాంటి పెద్ద లక్ష్యాలను ఛేదించడంపై దృష్టి సారించాలి' అని ట్రంప్ ట్విటర్లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే, అంగారకునిపైకి చేరుకోవడంపైనే ఎక్కువ దృష్టి సారించాలన్న ఉద్దేశంతోనే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని కొంతమంది ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు.
2024లోపు చంద్రునిపైకి చేరుకోవాలని నాసా నిర్దేశించుకుందని ఇటీవల ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ప్రకటించిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు అంగారక గ్రహంపైకి చేరుకునే లక్ష్యంలో భాగంగానే తొలుత చంద్రునిపైకి వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నామని నాసా తన వెబ్సైట్లో తెలిపింది.
అంగారక గ్రహంపై వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి చంద్రునిపై చేసే కొన్ని ప్రయోగాలు ఉపకరిస్తాయని పేర్కొంది. మూన్ మిషన్పై గత ఏప్రిల్లో నాసా చీఫ్ జిమ్ బ్రిడెన్స్టైన్ మాట్లాడుతూ.. ఈసారి చంద్రుని మీదకు చేరుకునేది కేవలం జెండాలు పాతి కొన్ని పాద ముద్రలు వదిలిరావడానికి కాదని.. అక్కడ కొంత కాలం గడిపి ప్రయోగాలు చేపట్టేందుకని స్పష్టం చేశారు. అయితే, తాము నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే ట్రంప్ సర్కార్ తన బడ్జెట్లో నాసా పరిశోధనల కోసం రూ.11వేల 102 కోట్లు కేటాయించాలని కోరారు. ఒకవేళ ట్రంప్ ఇంత మొత్తాన్ని బడ్జెట్లో కేటాయించకపోయినట్టయితే తాము నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోలేమని బ్రిడెన్స్టైన్ తెలిపారు. రోవర్ మిషిన్ ద్వారా అంగారక గ్రహంపైకి హెలికాప్టర్ను పంపించాలని నాసా యోచిస్తున్నదని అన్నారు.
1968లో 'అపోలో-11' ద్వారా వ్యోమగాములు నీలామ్ స్ట్రాంగ్, మైకేల్ కొల్లిన్స్, ఎడ్విన్ ఇ అల్డ్రిన్లను నాసా చంద్రుడిపైకి పంపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 1969, జులై20న చంద్రుడి మీద మనిషి కాలు మోపాడు. అయితే, తాజాగా మళ్లీ మనిషిని చంద్రుడి మీదకు పంపేందుకు నాసా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మిషన్కి ఆర్టెమిస్ అని గ్రీకు చంద్రదేవత పెట్టారు. ఈసారి చంద్రయాత్రలో మహిళా వ్యోమగాములకు కూడా అవకాశం కల్పించే దిశగా ప్రయత్నాలు చేయడం విశేషం.
అంతరిక్ష పర్యాటకంపై 'నాసా' దృష్టి
అంతరిక్ష పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు 2020నాటికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని పూర్తి స్థాయిలో సిద్ధం చేయనున్నట్టు నాసా ప్రకటించింది. ఈ క్రమంలో 30 రోజుల పాటు వ్యోమగాములు అంతరిక్షంలో గడిపేందుకు ప్రత్యేక ప్రాజెక్టును చేపట్టినట్టు వెల్లడించింది. ఇందులో భాగంగా కక్షలో తిరుగుతున్న ఈ ఉపగ్రహంలో ఒక్క రాత్రి గడపాలనుకునే వారి నుంచి 35 వేల డాలర్లు(రూ.24 లక్షలు) చొప్పున వసూలు చేస్తామని తెలిపింది. రాకపోకల చార్జీలతో కలిపి ఒక్కొక్కరికి రూ.400 కోట్ల వరకు ఖర్చవుతుందని తెలిపింది.
అంతరిక్ష కేంద్రం నిర్వహణలో ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు ఈ ప్రయత్నం దోహదపడు తుందని నాసా భావిస్తోంది. ప్రస్తుతం ఈ ఏడాదిలో రెండు సార్లు ప్రయివేట్ వ్యోమగాములను అనుమతిం చేందుకు అవకాశముందని నాసా అధికారులు తెలిపారు. ఈ పర్యటనలను ఏడాదికి 12 వరకు పెంచే అవకాశం ఉందన్నారు.