Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రష్యాతో ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని మెలిక పెట్టిన ట్రంప్ సర్కార్
వాషింగ్టన్: అమెరికా భారత్కు బంపర్ ఆఫర్ ఇచ్చింది. శత్రువుల స్థావరాలను నేలమట్టం చేసేందుకు ఉపకరించే అధునాతన పరిజ్ఞానంతో కూడిన సాయుధ డ్రోన్లను, క్షిపణుల దాడులను అడ్డుకునే టెక్నాలజీని భారత్కు అమ్మడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు వైట్ హౌస్ శనివారం వెల్లడించింది. అమెరికా ఇప్పటికే నిఘాకు వాడే గార్డియన్ డ్రోన్లను భారత్కు అమ్ముతున్న విషయాన్ని గుర్తు చేసింది. 2017, జూన్లో గార్డియన్ డ్రోన్ల అమ్మకాలకు సంబంధించి భారత్, అమెరికా మధ్య ఒప్పందం కుదిరిందని తెలిపింది. ఈమేరకు భారత ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారని తెలిపింది.
ఈ విషయమై వైట్ హౌస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ...భారత్కు థాడ్ ( టర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ ) క్షిపణి రక్షణ వ్యవస్థ, పేట్రియాట్ క్షిపణి రక్షణ వ్యవస్థ అమ్మకానికి, టెక్నాలజీ బదిలీకి అమెరికా సిద్ధంగా ఉందని తెలిపారు. 2016లో అమెరికా భారత్ను ప్రధాన రక్షణ భాగస్వామి హోదా ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అప్పటి నుంచి భారత్కు ఎంహెచ్-60ఆర్ సీహాక్ హెలికాప్టర్లు (రూ.18,041 కోట్లు) అపాచీ హెలికాప్టర్లు (రూ.15, 959 కోట్ల్లు) పీ-8ఐ నిఘా, గస్తీ విమానాలు ( రూ.20,817 కోట్లు), ఎం-777 హౌవిట్జర్ (రూ.5,114 కోట్లు) శతఘ్నులను అమెరికా అమ్మిందని అన్నారు. అమెరికా ఆయుధాలు, టెక్నాలజీ కొనుగోలు విషయంలో భారత్దే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. భారత్ ఇటీవల రూ.40,000 కోట్లతో రష్యా నుంచి అత్యాధునిక ఎస్-400 క్షిపణి నిరోధక వ్యవస్థ కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. దీన్ని అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రష్యాతో ఆయుధాలు, మిలిటరీ టెక్నాలజీ కొనుగోలు చేసే దేశాలపై క్యాస్టా చట్టం ప్రకారం తీవ్రమైన ఆంక్షలు విధిస్తామని హెచ్చరిస్తోంది. కాగా, ఈఏడాది ఫిబ్రవరి14న భారత్లోని పుల్వామా ప్రాంతంలో ఐఎస్ ఆత్మాహుతి దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈదాడిలో 40 మంది జవాన్లు మృతిచెందారు. ఈదాడిని అమెరికా సహా అనేక దేశాలు ఖండించాయి. ఇలాంటి దాడులను తిప్పికొట్టాలని అమెరికా భారత్ను కోరింది.