Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్రెసిలియా : బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు లూలా డిసిల్వా తనను విడుదల చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టేందుకు సుప్రీం ఫెడరల్ కోర్ట్ న్యాయమూర్తి గిల్మార్ మెండెస్ సోమవారం అంగీకరించినట్టు బ్రెజిల్ మీడియా వెల్లడించింది. లూలా తన న్యాయవాది ద్వారా గత ఏడాది దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్పై విచారణ చేపట్టేందుకు అప్పటి న్యాయమూర్తి సెర్జియో మోరో అంగీకరించిన విషయం తెలిసిందే. అయితే ఆ తరువాత ఆయన జియర్ బోల్సనారో మంత్రివర్గంలో న్యాయశాఖ మంత్రిగా నియమితు లైన తరువాత ఈ విచారణ పెండింగ్లో పడింది. ఇప్పుడు మరో న్యాయమూర్తుల బృందం ఈ పిటిషన్ను ఈ నెల 25న పరిశీలించేందుకు అంగీకరించినట్టు బ్రెజిల్ మీడియా వెల్లడించింది. ఈ విచారణ ప్రక్రియకు సంబంధించిన అజెండాలో ఈ పిటిషన్ను గత ఏడాది డిసెంబర్లోనే చేర్చారు. అయితే అప్పుడు విచారణ చేపట్టేందుకు డిసెంబర్ 4న న్యాయమూర్తి మెండెస్ నిర్ణయించినప్పటికీ, ఆ సమయంలో లూలా హెబియస్ కార్పస్ పిటిషన్కు వ్యతిరేకంగా ఇద్దరు న్యాయమూర్తులు ఓటు చేయటంతో ఆ విచారణను సస్పెండ్ చేశారు. ఇప్పుడు జరిగిన పాక్షిక ఓటింగ్లో ఈ పిటిషన్పై విచారణకు మార్గం సుగమమైంది. దీనిపై న్యాయమూర్తులు మెండెస్, సెల్సోడి మెల్లో, రికార్డో లెవన్డోవిస్కీ ఇంకా ఓటు చేయాల్సి ఉంది. లూలా విడుదలకు సంబంధించిన మరో వినతిని కూడా సుప్రీంకోర్టు మంగళవారం అజెండాలో చేర్చారు. దీనిపై న్యాయమూర్తి మెండెస్ ప్లీనరీ సెషన్లో తీర్పు వెలువరించాల్సి ఉంది.
సెర్జియో మోరోను తొలగించాలి:
న్యాయవాదుల డిమాండ్
మాజీ అధ్యక్షుడు లూలా విషయంలో వివక్షా పూరితంగా వ్యవహరించిన న్యాయశాఖ మంత్రి సెర్జియో మోరోను వెంటనే పదవి నుంచి తొలగించాలని బ్రెజిల్ బార్ అసోసియేషన్, పార్లమెంట్ సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న లూలా డిసిల్వాను జైలుకు పంపేందుకు కేసు విచారణ సమయంలో ఆయన ప్రాసిక్యూటర్లతో కుమ్మక్కయినట్టు మీడియాలో వచ్చిన వార్తలపై స్పందించిన బార్ అసోసియేషన్, పార్లమెంట్ సభ్యులు ఈ డిమాండ్ను తెరపైకి తెచ్చారు.
2018లో జైలు శిక్షకు గురి కావటంతో లూలాను అధ్యక్ష ఎన్నికలకు అనర్హుడిగా అక్కడి ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగస్వాములైన ప్రాసిక్యూటర్లం దరిపై కూడా సమగ్ర విచారణ చేపట్టాలని బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. అయితే న్యాయశాఖ మంత్రి మోరో మాత్రం తనపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారాలేనని తోసిపుచ్చారు. ఇవన్నీ కేవలం సంచలనం కోసమే చేస్తున్నారని ఆయన విమర్శించారు.