Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికా రక్షణ వాదంపై పోరులో భారత్ కలిసి రావాలి: సి జిన్పింగ్
- బిష్కెక్ సమావేశంలో మోడీ-సి జిన్పింగ్ భేటీ
బిష్కెక్ : భారత్-చైనాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను మరింత మెరుగుపరుచుకునే దిశగా తాము కలిసి పనిచేయనున్నట్లు ప్రధాని మోడీ గురువారం ట్వీట్ చేశారు. చైనా అధ్యక్షుడు సి జిన్పింగ్తో ప్రతినిధి స్ధాయి చర్చల అనంతరం ఆయన ఈ ట్వీట్ చేశారు. ఇక్కడ జరుగుతున్న షాంఘై సహకార సదస్సు (ఎస్సిఓ) సందర్భంగా చైనా అధ్యక్షుడు సి జిన్పింగ్, ప్రధాని మోడీలు భేటీ అయ్యారు.. సమావేశం ప్రారంభం కావడానికి ముందు జిన్పింగ్ మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వాణిజ్య రక్షణ వాద విధానాలు, సుంకాలను ఏకపక్షంగా విధించడంలో తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలను ఎదుర్కొనేందుకు యునైటెడ్ ఫ్రంట్గా ఏర్పడాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. గత ఏడాది కాలంగా చైనా-అమెరికాల మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో చైనా టెలికం సంస్ధ హువేపై అమెరికా ఆంక్షలను కఠినతరం చేయడంతో వాణిజ్య యుద్ధ తీవ్ర రూపం తీసుకుంది. ట్రంప్ అనుసరిస్తున్న రక్షణ వాద విధానాలపై జరుపుతున్న పోరాటంలో భారత్ చేతులు కలుపుతుందని భావిస్తున్నటుష్ట్రఓ చైనా అధికారులు ఈ సందర్భంగా తెలిపారు.
మోడీ ప్రధానిగా రెండో సారి పదవీబాధ్యతలు చేపట్టిన తరువాత జిన్పింగ్తో సమావేశమవ్వడం ఇదే తొలిసారి.. జైష్ ఎ మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించి బ్లాక్లిస్ట్లో ఉంచడంపై చైనా గత నెలలో తన అభ్యంతరాలను ఉపసంహరించుకున్న తరువాత జరిగిన తొలి సమావేశం కూడా ఇదే. ఈ సందర్భంగా మోడీ ట్వీట్ చేస్తూ తమ ఇరువురి మధ్య భేటీ ఫలవంతంగా జరిగిందని, ద్వైపాక్షిక సంబంధాలపై పూర్తిస్థాయిలో చర్చించామని తెలిపారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో మోడీ విజయం సాధించడంపై జిన్పింగ్ అభినందనలు తెలిపారు. దీనికి స్పందిస్తూ మోడీ ఆయనకు కృతజ్ఞతలు తెలపడమే కాకుండా శనివారం పుట్టిన రోజు జరుపుకోనున్న జిన్పింగ్కు దేశ ప్రజల తరుపున ముందస్తు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 15తో జిన్ పింగ్ 66వ పడిలోకి ప్రవేశిస్తారు. రానున్న రోజుల్లో పలు అంశాలలో పురోగతి సాధించేందుకు ఇరువురం కలిసి కృషి చేయాల్సి ఉందని మోడీ పేర్కొన్నారు. వూహాన్లో సమావేశమైన అనంతరం రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలలో కొత్త ఒరవడి, స్ధిరత్వం ఏర్పడ్డాయన్నారు. ఇరువైపులా వ్యూహాత్మక కమ్యూనికేషన్ల పురోగతి సాధ్యమైందని చెప్పారు. కొత్త రంగాలలో మరింత సహకారానికి దారి తీసిందని మోడీ చెప్పారు. వూహాన్లో 2018లో జరిగిన సదస్సు అనంతరం వివిధ రంగాల్లో సంబంధాలను మెరుగుపరుచుకునే దిశగా ఇరు దేశాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. కాగా ఇరు దేశాల నేతల మధ్య సౌహార్ధ్ర సమావేశం జరిగిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చుకొనడంతో సహా పలు అంశాలపై నేతలు చర్చించినట్లు చెప్పారు. రెండు దేశాల మధ్య మరింత విస్తృత భాగస్వామ్యం కొనసాగడంలో వ్యూహాత్మక కమ్యూనికేషన్ సానుకూల పాత్రను గుర్తించారని కుమార్ తెలిపారు.