Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర మంత్రి సహా 12 మంది మృతి
ఇస్లామాబాద్ : పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఉగ్రవాదులు ఆదివారం ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పంజాబ్ రాష్ట్ర హోంమంత్రితో సహా 12 మంది మృతి చెందారు. పంజాబ్లోని షాదిఖెల్ గ్రామంలో హోంమంత్రి తన నివాసంలో జిగ్రా (స్థానికులతో సమావేశం) నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి సుమారు వంద మంది హాజరైనట్టు సమాచారం. అదే సమయంలో ఉగ్రవాదులులోనికి ప్రవేశించి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. సమావేశం జరుగుతున్న గది గోడ సమీపంలో బాంబు పేలుడు సంభవించటంతో భవనం కూలిపోయింది. దీంతో హోంమంత్రి షుజా ఖాన్జాదా సహా దాదాపు 30 మంది భవనంలో చిక్కుకుపోయారు. బాంబు దాడికి సమీపంలో వున్న భవనాలు కూడా ధ్వంసమయ్యాయి. సమాచారమందుకున్న పోలీసులు, అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన హోంమంత్రి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనలో హోంమంత్రితో సహా డీఎస్పీ షౌఖత్ షా కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకూ ఐదు మృత దేహాలను వెలికితీశారు. శిథిలాల్లో చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు సహాయచర్యలు కొనసాగుతున్నాయి. ఖాన్జాదా గతేడాది అక్టోబరులో పంజాబ్ హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పంజాబ్లో తీవ్రవాదాన్ని అంతమొందించే ప్రయత్నాల్లో ఖాన్జాదా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే ఆల్ఖైదా పంజాబ్ చీఫ్, తన అనుచరులు ఓ ఎన్కౌంటర్లో మృతిచెందినట్టు ఖాన్జాదా ప్రకటించారు. అప్పటి నుంచి ఖాన్జాదాకు ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు వచ్చినట్టు అధికారులు తెలిపారు.