Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
- తదనంతరం...తన పదవికి రాజీనామా !
ఇస్లామాబాద్ : ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ మాజీ అధినేత పాక్లోని ప్రముఖ నాయకులకు వ్యతిరేకంగా కుట్రలు చేశాడని ఆ దేశ మంత్రి ముషాహిదుల్లా ఖాన్ సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. బిబిసి ఉర్దూకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పైవ్యాఖ్యలు చేశారు. దీనిపై పలు వర్గాల నుంచి విమర్శలు రావటంతో తన పదవికి రాజీనామా కూడా చేశారు. వాతావరణ శాఖా మంత్రిగా పనిచేస్తున్న ముషా హిదుల్లా ఖాన్ తన ఇంటర్వ్యూలో...గత ఏడాది ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెహ్రిక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ చేపట్టిన నిరసన ఉద్యమాన్ని ప్రస్తావించారు. ఆ సమయంలో ఐఎస్ఐ చీఫ్, లెఫ్టినెంట్ జనరల్ జహీరుల్ ఇస్లాం దేశ సైనిక, రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా కుట్రకు పాల్పడ్డారని వ్యాఖ్యానించారు. ప్రధాని నవాజ్ షరీఫ్ ఇంటిపై దాడి చేయాల్సిందిగా తెహ్రిక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ నిరసన కారుల్ని జహీరుల్ ఇస్లాం రెచ్చగొట్టారని, వీటికి సంబంధించిన రికార్డులు సాక్ష్యంగా వున్నాయని, ఆర్మీ జనరల్ రషీల్ షరీఫ్తో సమావేశం సందర్భంగా ప్రధాని నవాజ్ షరీఫ్ ఈ రికార్డులు వినిపించారని బిబిసి ఇంటర్వ్యూలో ముషాహిదుల్లా ఖాన్ చెప్పారు. మంత్రి ముషాహిదుల్లా ఖాన్ చేసిన ఆరోపణల్ని పాక్ సమాచార శాఖ మంత్రి పర్వేజ్ రషీద్ తీవ్రంగా ఖండిం చారు. అలాంటి ఘటన జరగలేదని, రికార్డు టేపుల ఆధారాలు వంటివేవీ నిజం కాదని అయన అన్నారు. ముషా హిదుల్లా ఖాన్ చేసిన వ్యాఖ్యలు పూర్తి బాధ్యతారాహిత్య మైనవని, వాస్తవాల్ని వక్రీకరించట మేనని అన్నారు. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యల్ని పాక్ సైన్యం కూడా తీవ్రంగా ఖండించింది.