Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశీయంగా పెరగనున్న 28 రకాల వస్తువుల ధరలు
న్యూఢిల్లీ : అమెరికా నుంచి దిగుమతయ్యే కొన్ని వస్తువులపై భారత్ భారీగా సుంకాలు పెంచింది. ఈ సుంకాలు ఆదివారం నుంచి అమల్లోకి వచ్చాయని కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) ఓ ప్రకటనలో తెలిపింది. మొత్తం 28 ఉత్పత్తులపై సుంకాలు పెంచగా వాటిలో బాదం, పప్పుదినుసులు, వాల్నట్స్ సహా మరికొన్ని ఉత్పత్తులు ఉన్నాయి. సుంకాలు పెంచటంతో దేశీయ మార్కెట్లో ఈ ఉత్పత్తుల ధరలు మరింతగా పిరం కానున్నాయి. భారత్ నుంచి దిగుమతయ్యే స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై అమెరికా ప్రభుత్వం గతేడాది జూన్ 21 నుంచి పన్నులు పెంచిన విషయం తెలిసిందే. ఇందుకు ప్రతిగా అమెరికా నుంచి దిగుమతయ్యే 28 రకాల వస్తువులపై పన్నులు పెంచుతున్నట్టు భారత్ తెలిపింది. అమెరికాలో తయారయ్యే, ఆ దేశం నుంచి దిగుమతయ్యే వస్తువులకు ఇది వర్తిస్తుందని తెలిపింది. దీంతో వాల్నట్స్పై 30 శాతం నుంచి 120 శాతానికి, పప్పులపై 30 నుంచి 70 శాతానికి పన్ను పెరగనుంది. సుంకం వసూలు 40 శాతానికి పెరగనుంది. బోరిక్ ఆమ్లం, అచ్చు సంబంధిత వస్తువులపై 7.5 శాతం సుంకం పెరగనుంది. దేశీయంగా వాటిని తయారు చేయబడే వస్తువులపై 10 శాతం సుంకం విధించనున్నారు. ఈ పెంపుతో భారత్కు దాదాపు రూ.1501 కోట్ల ఆదాయం అధికంగా సమకూరనుంది. అయితే సుంకాలు పెంచే వస్తువుల జాబితాలో 29 ఉత్పత్తులు ఉన్నాయి. రొయ్యల జాతికి చెందిన ఆర్టెమియాను చివర్లో ఈ జాబితా నుంచి భారత్ తొలగించింది.
అమెరికా గతేడాది మార్చిలో భారత్ నుంచి దిగుమతయ్యే ఉక్కుపై 25 శాతం, అల్యూమినియం ఉత్పత్తులపై 10 శాతం సుంకం విధించింది. అంతకు ముందు ఈ వస్తువులపై ఎటువంటి సుంకం లేదు. సుంకాల పెంపు విషయం చర్చల ద్వారా కొంత పరిష్కారం లభిస్తుందనే నమ్మకంతో భారత్ సుంకాల పెంపును ఎనిమిది సార్లు వాయిదా వేసింది. అయితే కొన్ని రోజుల కిందట అమెరికా జీఏస్పీ నుంచి భారత్ను తొలగిస్తూ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో ఎగుమతి ప్రోత్సాహకాలు భారత్కు అందకుండా పోయిన సంగతి తెలిసిందే. సుంకాల పెంపు విషయాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) ఆధ్వర్యంలో సమస్య పరిష్కరించుకుందామని అమెరికాను భారత్ కోరింది. ప్రతేడాది భారత్ దాదాపు రూ.10475 కోట్ల విలువైన ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేస్తుంది