Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముంబయి పేలుళ్ల సూత్రధారి అరెస్ట్పై అమెరికా పెదవి విరుపు
వాషింగ్టన్ : ముంబయి పేలుళ్ల సూత్రధారి, జమాత్-ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్కు శిక్షపడితేనే తాము విశ్వసిస్తామని అమెరికా ప్రకటించింది. సయీద్ అరెస్ట్పై ట్రంప్ స్పందించారు. సయీద్ గతంలోనూ అనేకసార్లు అరెస్టయి విడుదలైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రెండేండ్లుగా తాము ఒత్తిడి పెంచడం వల్లే అతన్ని పాక్ అరెస్టు చేసిందని అన్నారు. పదేండ్ల గాలింపు తర్వాత ముంబయి ఉగ్రదాడుల సూత్రధారి పాకిస్థాన్లో అరెస్టయ్యాడని, అతడిని అదుపులోకి తీసుకోవాలంటూ రెండేండ్లుగా పాక్పై బాగా ఒత్తిడి చేశామని ట్రంప్ పేర్కొన్నారు. తర్వాత కాసేపటికే అమెరికా ఓ ప్రకటన విడుదల చేసింది. హఫీజ్ సయీద్ అరెస్టు విషయం నమ్మేలా లేదని యూఎస్ స్టాండింగ్ కమిటీ పేర్కొంది. ట్రంప్ ట్వీట్ను కోట్ చేస్తూ ఈ విషయాన్ని ట్విటర్లో పేర్కొంది. పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ త్వరలో అమెరికా పర్యటనకు వెళుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 'పాకిస్థాన్ పదేండ్ల నుంచి హఫీజ్ సయీద్ను వెతకడం లేదు. పాకిస్థాన్లో అతడు స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. అతడిని అరెస్టు చేస్తున్నారు. అరెస్టయిన కొద్దిరోజుల్లోనే విడిచిపెడుతున్నారు. 2001 డిసెంబరు, 2002 మే, 2002 అక్టోబరు, 2006 ఆగస్టు, 2008 డిసెంబరు, 2009 సెప్టెంబర్, జనవరి 2017లోనూ ఇదే జరిగింది. సయీద్కు శిక్ష పడేంత వరకు మన ప్రశంసలను మనతోనే ఉండనిద్దాం' అని ట్వీట్ చేసింది. ట్రస్టుల ద్వారా సేకరించిన నిధులను ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించారని సయీద్ సహా మొత్తం 13 మంది అగ్రనేతలపై ఈ నెల 3న సీటీడీ కేసులు నమోదు చేసింది. వీరిలో కొందరు నిందితులు ఇప్పటికే న్యాయస్థానం నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. సయీద్ కూడా ఇదే ప్రయత్నంలో బుధవారం గుజ్రన్వాలా నుంచి లాహౌర్కు పయనమయ్యాడు. మార్గం మధ్యంలోనే సీటీడీ అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని, న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు లాహౌర్లోని అత్యంత కట్టుదిట్టమైన కోట్ లఖ్పత్ జైలుకు తరలించారు.