Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భద్రతా బలగాలకు, నిరసనకారులకు మధ్య ఘర్షణ : 25 మంది మృతి
అడిస్ అబాబ : ఇథియోపియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఫెడరల్ రాజ్యంలో తమను భాగస్వామ్యం చేయాలని సిదామా తెగకు చెందినవారంతా గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈమేరకు గురువారం ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ రిఫరెండమ్ను ఎలాగైనా అడ్డుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. నిరసనకారులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయాలని సైనిక, పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో భద్రతాబలగాలకు, నిరసనకారులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. సిదామా నిరసనకారులపై సైన్యం బల ప్రయోగం చేసింది. సైనికులు లాఠీలు ఝళిపించారు. బాష్పవాయుగోళాలు ప్రయోగించారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు బుల్లెట్లు ప్రయోగించారు. ఈ ఘటనలో 25 మంది మృతిచెందగా, పదులసంఖ్యలో గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఇథియోపియా జనాభాలో సిదామా తెగకు చెందినవారు 4 శాతం మంది ఉన్నారు.
ప్రస్తుత అధికార పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించినప్పుడు వీరిని మభ్యపెట్టింది. ఎన్నికల్లో గెలుపొందినట్టయితే సిదామా తెగకు చెందినవారిని ఫెడరల్ వ్యవస్థలో చేర్చుతామని భరోసా ఇచ్చింది. రిఫరెండమ్ నిర్వహించి తదుపరి కార్యాచరణ సిద్ధం చేస్తామని తెలిపింది. అయితే, ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత నేతల స్వరం మారింది. ఇచ్చిన హామీలను విస్మరించారు. సిదామా తెగకు చెందినవారి అభ్యర్థనలను పట్టించుకోలేదు. దీంతో, తాజాగా ఆందోళన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.